ప్రత్యేకహోదా విషయంలో ఏపీలో అధికార,ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. కేంద్ర ప్రభుత్వం వైఖరికి నిరసన అంటూ చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక్కరోజు దీక్ష… దొంగ దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.
నిరసన అంటూ బాబు చేసే ఒక రోజు దీక్ష కాదని.. అది దొంగదీక్ష అంటూ మండిపడ్డారు. పిల్లను ఇచ్చిన మామను వెన్నుపోటు పొడిచిన బాబు అధికారాన్ని చేపట్టారన్నారు. బాబు తన ఎదుగుదలలో భాగంగా సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ను కూడా వాడుకున్నారన్నారని ధ్వజమెత్తారు.
హోదా కోసం జపాన్ తరహా ఆందోళన అంటూ చంద్రబాబు గందరగోళంగా మాట్లాడతారని.. అసలు జపాన్ తరహా నిరసన అంటే ఏమిటో చెప్పాలన్నారు. జపాన్ తరహా పోరాటం అంటే ఇదేనా అని ఎద్దేవ చేశారు. హోదా కోసం ముఖ్యమంత్రి చేసే దీక్షకు డ్వాక్రా మహిళలు.. స్కూల్ పిల్లలతో దీక్ష ఎలా మద్దతు తీసుకుంటారని ప్రశ్నించారు. మహిళలు.. పిల్లలకు బదులుగా టీడీపీ నేతలు.. కార్యకర్తలు దీక్షకు రావాలన్న సూచన చేశారు.
బాబు చేస్తున్న దీక్ష ధర్మ పోరాటం కాదని.. అధర్మ పోరాటమని..ప్రజల్ని.. ఉద్యమకారుల్ని తప్పు దారి పట్టించటమే బాబు లక్ష్యమన్నారు. హోదా కోసం పేపర్ ఉద్యమాల్ని బాబు కట్టిబెట్టాలన్నారు.