జనసేన, చంద్రబాబు, లోక్సత్తా పార్టీ నేతలపై వైసీపీ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. చంద్రబాబు కోసం పుట్టిన కవలల్లో ఒకటి లోక్సత్తా పార్టీ కాగా, మరొకటి జనసేత పార్టీ అని ఎద్దేవా చేశారు. మరో సారి అధికారంలోకి బాబు తీసుకురావాలని రెండు పార్టీలు గుంపులు బయలు దేరాయని విమర్శలు చేశారు. ప్రజా రాజ్యం పార్టీనీ నడపలేక చిరు చేతులెత్తేసినపుడు పవన్ ఏం చేశారని ప్రశ్నించారు. వానాకాలంలో మొలిచే పుట్టగొడుగులాంటి పార్టీ జనసేనని వ్యంగ్యాస్త్రాలు సందించారు.
మరోవైపు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై అంబటి ధ్వజమెత్తారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలుసుకుని చంద్రబాబు ఆర్భాటం చేస్తున్నారని విమర్శించారు. గోదావరి-పెన్నా నదుల అనుసంధానం పేరుతో డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు పాలనలో చోటుచేసుకున్న అవినీతి గురించి లోక్ సత్తా పార్టీ ప్రశ్నించడం లేదని అంబటి దుయ్యబట్టారు. లోక్ సత్తా పార్టీ పాతపార్టీ అయినా కొత్త డ్రైవర్ జేడీ లక్ష్మీనారాయణ అంటూ ఎద్దేవా చేశారు. లోక్ సత్తా పార్టీ జెండా పైకి నీలం రంగులో ఉన్నా లోపల అంతా పసుపుమయం అని ధ్వజమెత్తారు.
తమ అధినేత జగన్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా… ఆయన ధైర్యంగా ఎదుర్కొన్నారని అన్నారు. జగన్ విమర్శించే స్థాయి పవన్ కల్యాణ్ కు లేదని చెప్పారు.ఒక్క ఎమ్మెల్యే ఉన్నాకూడా అసెంబ్లీలో పోరాడుతానంటున్న పవన్.. గత ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదో చెప్పాలన్నారు. అసెంబ్లీలో జరుగుతున్న అన్యాయాలను ప్రజలకు తెలియజేయడానికే అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించామని చెప్పారు.