కడప జిల్లా బద్వేల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత డాక్టర్ వెంకట సుబ్బయ్య ఈ ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట అనారోగ్యం బారినపడి కోలుకున్న తర్వాత మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య. మళ్లీ ఆయన అస్వస్థత గురికావడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఈయనకు భార్య, ఇంటర్ చదువుతున్న కుమారుడు, ఎంబీబీఎస్ నాలుగో ఏడాది చదువుతున్న కుమార్తె ఉన్నారు.
ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు వైసీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. ఎమ్మెల్యే స్వస్థలం బద్వేలు పురపాలకలోని మల్లెలవారిపల్లి. మారుమూల గ్రామంలో జన్మించినా.. వైద్య వృత్తిని చేపట్టాలని వెంకట సుబ్బయ్య కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రజలకు సేవలందించారు.
2016లో బద్వేల్ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టి, ఆపై 2019లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఓబులాపురం రాజశేఖర్ పై 44 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. సుబ్బయ్య మృతి పట్ల ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి సంతాపం తెలిపారు. వెంకట సుబ్బయ్య భార్య కూడా వైద్యురాలు.
ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని ఆదివారం మధ్యాహ్నం బద్వేలు తీసుకెళ్లనున్నారు.
చేపలు కావాలా.. అయితే మీ ఇంటి దగ్గరలో ఇలా..!