జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వైసీపీ ఎమ్మెల్సీ ఆళ్లనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ని ఫ్యాక్షనిస్టుగా ముద్రవేయాలని చూస్తున్న పవన్ మానసిక స్థితి బాగోలేదన్నారు. పవన్ వైఎస్ జగన్ను ఫ్యాక్షనిస్టు అని పేర్కొనడం సరికాదని హితవు పలికారు.
ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నానని చెప్పుకుంటున్న పవన్ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. చంద్రబాబు పిలవలేదు కాబట్టే ఢిల్లీ వెళ్లలేదని పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న లోకేష్ను పవన్ తమ్ముడిగా ఎలా సంభోదిస్తారని ప్రశ్నించారు. ప్రజల గోడును విందామని, కళ్లారా చూద్దామని వైఎస్ జగన్ చేస్తున్న పాదయాత్ర పవన్కు కనపడటం లేదా అని ప్రశ్నించారు.
వారసత్వ రాజకీయాలపై తెగ స్పీచ్లిస్తున్న పవన్ సినిమాల్లోకి ఎలా వచ్చారనీ, ఆయన వారసత్వంగా ఇండస్ట్రీలోకి రాలేదా అని ప్రశ్నించారు.వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వైఎస్ జగన్ ఓదార్పుయాత్ర చేపట్టకుండా, కాంగ్రెస్ను వీడకుండా ఉంటే కేంద్రమంత్రి అయ్యేవారనీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవారని వ్యాఖ్యానించిన విషయాన్ని పవన్ కళ్యాణ్ గుర్తుంచుకుంటే మంచిదని నాని హితవు పలికారు.