ముందస్తు ఎన్నికల సమాచారం నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలు వైసీపీకి డు ఆర్ డై లాంటివి. అధికారంలోకి రాకుంటే వైసీపీనీ మరచిపోవాల్సిందేనన్న వార్తలు కూడా వస్తున్నాయి. పార్టీనీ విజయపథంలో నడిపించేదానికి రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ను జగన్ నియమించారు. పీకేటీమ్ ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలపై అనేక సార్లు సర్వే నిర్వహించింది. ఈ సర్వే రిపోర్ట్లను ఎప్పటికప్పుడు జగన్కు అందిస్తున్నారు పీకేటీమ్.
2019 లో అధికారంలోకి రావాలని జగన్ ఒక వైపు పాదయాత్ర చేస్తుంటే మరో వైపు… వైసిపిని విజయపథంలో నడిపించి జగన్ ని ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలని ప్రశాంత్ కిషోర్ విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కొత్త ప్రయోగాలు చేయాలని నిర్ణయించుకున్నారు. నిన్నటి వరకు బలమైన రాజకీయనేతలపై దృష్టి పెట్టిన ప్రశాంత్ కిషోర్ టార్గెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. అధికారంలోకి రావాలంటే బలమైన నేతలతో సరిపోదని ఇప్పుడు రూట్మార్చారు.
నిన్నటి వరకు రాజకీయ నాయకులపై దృష్టిపెట్టిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టాలీవుడ్పై పూర్తి దృష్టి సారించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డికి, కాంగ్రెస్కు అనుకూలంగాఉన్న ప్రముఖ హీరోలను పార్టీలో చేర్పించేందుకు పీకే తెర వెనుక ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్కు ఉన్న మాస్ ఇమేజ్కుతోడు హీరోల ఇమేజ్ తోడైతే పార్టీ గెలుపు ఖాయమనే చెప్పవచ్చు.
దీనిలో భాగంగానే ఈ మధ్యనే తమిళ్ స్టార్ హీరో సూర్య జగన్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అవసరం అయితే జగన్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేస్తానని ప్రకటించారు. తెలుగులో కూడా సూర్యకు మంచి ఇమేజ్ ఉంది. మరో వైపు హీరో సుమంత్కూడా జగన్ చిన్ననాటి స్నేహితుడనే విషయం తెలిసిందే. జగన్కు మద్దతు ఇస్తారనండంలో సందేహంలేదు.
డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబుకూడా 2019 ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్దంగా ఉన్నారు. మోహన్బాబు, వైఎస్ కుటుంబాల మధ్యనున్న సంబంధాలు తెలిసిందే. వైసీపీ తరుపున మోహన్ బాబు పోటీ చేస్తారనడంలో సందేహంలేదు.
ఇక సినీ హీరో అక్కినేని నాగార్జున ఎప్పటినుంచో వైఎస్ కుటుంబానికి సన్నిహితుడు. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డితోనే సన్నిహితంగా మెలిగిన అనుభవం నాగార్జునకు ఉంది. ఈ నేపథ్యంలో నాగార్జునని వైసిపిలోకి తీసుకురావడానికి ఇదే సరైన సమయం అని పీకే భావిస్తున్నారట. నాగార్జునని పార్టీలోకి ఆహ్వానించి 2019 లో ఓ హాట్ సీట్ నుంచి బరిలోకి దింపితే పార్టీకి మైలేజి వస్తుందనేది ప్రశాంత్ కిషోర్ ఆలోచనగా ఉంది. కింగ్ నుంచి క్లారిటీ వస్తే మన్మధుడు కాస్తా రాజకీయ నాయకుడు అయిపోయినట్లే అని ప్రచారం జరుగుతోంది.