నేటి రోజుల్లో అబ్బాయిలకు అమ్మాయిలు దొరకడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. దాంతో ఏం చేయాలో తెలియక… అమ్మాయిలు దొరకక….. ఎవరికి వారు బ్రోకర్లను ఆశ్రయిస్తున్నారు. దాంతో వారు చెప్పిందే వేదమన్నట్లుగా ఉంది వ్యవహారం. అది నిజమో కాదో తెలియక చాలామంది వేలకు వేలు వారికి పోసేస్తున్నారు. తీరా చూస్తే..వారు పిల్లను చూపించడం లేదు… పెళ్లి చేయడం లేదు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
దిల్సుఖ్నగర్ మధురాపురి కాలనీకి చెందిన సబ్బారపు వాసవి, వడ్డెమాను లక్ష్మీదేవిలు కలిసి చిక్కడపల్లిలో ‘న్యూలైఫ్ మ్యాట్రిమోని మ్యారేజెస్’ పేరుతో వివాహ వేదిక రన్ చేస్తున్నారు. అందులో 8 మంది టెలీకాలర్లను నియమించారు.. పెళ్లిళ్లు చేయిస్తామంటూ పత్రికల్లో ప్రకటలు ఇస్తున్నారు. వనస్థలిపురంకు చెందిన మామిడిశెట్టి సునీల్ ఈ ఏడాది జనవరిలో చిక్కడపల్లిలోని వివాహ వేదికకు వెళ్లి రిజిస్ట్రేషన్ ఫీజు 3వేలు చెల్లించాడు. వాసవితో మాట్లాడగా… రెండు రోజుల్లో నేరుగా వధువుతోనే మాట్లాడిస్తాం అని చెప్పింది. రెండు రోజుల తర్వాత నిర్వాహకురాలు తమ టెలీకాలర్తో సునీల్కు ఫోన్ చేయించింది. పెళ్లికి అభ్యంతరంలేదని, తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలను చెబుతానని సునీల్కు చెప్పించింది. వారం రోజుల తర్వాత సునీల్ ఫోన్ చేయగా… ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది.
దీంతో అతడు నేరుగా న్యూలైఫ్ మ్యారేజ్ బ్యూరోకు వెళ్లగా వాసవి లేదు. అక్కడున్న సిబ్బందిని గట్టిగా ప్రశ్నిస్తే… తామే పెళ్లి కూతురులుగా ఫోన్ చేస్తామని, కొద్దిరోజుల తర్వాత తమ మేడం సదరు యువతికి పెళ్లయ్యిందంటూ అబద్ధం చెబుతుందని, దీంతో డబ్బు కట్టిన వారు మరోచోట సంబంధం వెతుక్కుందాం అనుకుంటూ వెళ్తారని వివరించారు. దీంతో తనను మోసం చేశారని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబ్బారపు వాసవి, వడ్డెమాను లక్ష్మిదేవీలను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
పెళ్లి సంబంధాల పేరుతో ముందుగా రిజిస్ట్రేషన్ పేరుతో రూ.5వేల నుంచి రూ.10వేలు తీసుకుంటున్నారు. వారం రోజుల తర్వాత ఫోన్ చేయాలంటూ డబ్బు ఇచ్చిన వారికి చెబుతున్నారు. వారం రోజుల తర్వాత ఫోన్ చేస్తే మాట్లాడ్డం లేదు. రూ.5వేలు, రూ.10వేలు పెద్ద మొత్తం కాదని అనుకుంటున్నారు. పైగా పోలీసుల వద్దకు వచ్చి మ్యారేజ్ బ్యూరో వారు మోసం చేశారని వివరిస్తే… పరువు పోతుందన్న భావనతో చాలామంది బాధితులు ముందుకు రావడం లేదు.