జనసేన ఒంటరి పోరు ప్రతిపక్ష వైసీపీని దెబ్బతీయడానికేనా.? అదును చూసే జనసేనాని పవన్ ఒంటరి పోరుకు దిగుతున్నాడా.? పవన్ బరి వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారా.? అందుకే టీడీపీతో చర్చలు జరిపి ఆ పార్టీలో చేరుతాడనుకున్న జేడీ లక్ష్మీనారాయణ జనసేనలో చేరారా.? దీని వెనుక ఎవరున్నారు.? ఎవరికి నష్టం అన్న ప్రశ్నలు ఏపీ రాజకీయాలను జాగ్రత్తగా గమనిస్తున్న వారికి కలుగక మానదు..
తాజాగా టీడీపీతో శీఘ్ర చర్చలు జరిపి ఆ పార్టీలో చేరుతారనుకున్న జేడీ లక్ష్మీ నారాయణ జనసేనలో చేరడం హాట్ టాపిక్ గా మారింది. దీన్ని బట్టి టీడీపీలో టికెట్లు దక్కని వారికి జనసేన కల్పవృక్షంలా కనిపిస్తోంది. బలమైన నాయకులను చంద్రబాబు స్కెచ్ ప్రకారమే జనసేనలోకి పంపిస్తున్నాడని.. జనసేన-చంద్రబాబు ఫ్రెండ్ షిప్ దీన్ని బట్టి అర్థం అవుతోందని రాజకీయ విశ్లేషకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీతో జనసేన ఇన్ డైరెక్ట్ స్నేహంపై వార్తలు వెల్లువెత్తుతున్న దృష్ట్యా కమ్యూనిస్టులు జనసేనతో కలిసి నడవడంపై పునరాలోచించుకోవాలని ఆ పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీట్ల పొత్తు పొడవక పోవడంతో ఈ టీడీపీ-జనసేన రాజకీయ ఆటలో కమ్యూనిస్టులు పావుగా మారద్దన్న చర్చ ఆ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది.
పోయినసారి 2014 ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయం అనుకుంటున్న సమయంలో పవన్ కళ్యాన్ ప్రత్యక్షమై టీడీపీకి సపోర్టు చేసి వైసీపీకి గెలుపును దూరం చేశాడనే టాక్ ఉంది. ఇప్పుడు ఈసారి కూడా పవన్ టార్గెట్ జగన్ అయ్యాడని రాజకీయ విశ్లేషకులు ఘంఠాపథంగా చెబుతున్నారు.