భార్య అందంగా లేదని చాలా మంది వేధిస్తూ ఉంటారు. సహజంగా ఇది మనం చూస్తూనే ఉంటాం. అందంగా ఉందని ఈర్ష్యతో పీడించే భర్తలు కూడా ఈ సమాజంలో ఉన్నారు. బెంగళూరు నగర జిల్లా పరిధిలోని అనేకల్ తాలూకాలో ఉన్న సర్జాపుర సమీపంలోని మాదప్పన హళ్ళి గ్రామంలో ఆదివారం రాత్రి అనుమానాస్పద మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు అందించిన సమాచారం మేరకు.. మాదప్పనహళ్ళి గ్రామానికి చెందిన సుబ్రమణి భార్య జయశ్రీ (26) మృతురాలు. రెండు ఏళ్ల కిందట మాదప్పనహళ్ళికి చెందిన సుబ్రమణి హొసకోటె ప్రాంతానికి చెందిన జయశ్రీని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె అందంగా ఉండటం అతనికి నచ్చేది కాదు. దాంతో అతను భార్య ముందు తక్కువ అని ఫీల్ అయ్యేవాడు. దాంతో భార్యను పదే పదే మాటలతో వేధించేవాడు. నువ్వు చాలా అందంగా ఉన్నావు కాబట్టి నాతో బయటకు రాకు.. నేను మూవీ తీయాలని అనుకుంటున్నా నీ పుట్టింటి నుంచి డబ్బులు తీసుకుని రా అని పీడించేవాడు.
గుడికి వెళ్లినా తాను ఒక లైన్లోవెళ్ళి భార్యను మరో లైన్లోవెళ్ళాలని హెచ్చరించేవాడు. ఇంట్లో ముస్తాబు అయినా ఎందుకు ఏమిటి అని ప్రశ్నించేవాడు. పదే పదే భర్త వేదింపులు తట్టుకోలేక జయశ్రీ తల్లిదండ్రులకు చెప్పింది. వారు అతనికి నచ్చజెప్పిన.. అతనిలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో శనివారం సాయంత్రం జయశ్రీ తల్లిదండ్రులకు ఫోన్ చేసి తాను ఇక్కడ ఉండలేనని, తీసుకునిపోవాలని మొరపెట్టుకుంది.
మేం ఒకటి రెండురోజుల్లో వస్తాం అని నచ్చజెప్పారు. ఈ పరిణామాలతో తీవ్ర విరక్తి చెందిన ఆమె ఆదివారం రాత్రి ఉరి వేసుకున్నట్లు స్థితిలో శవమై తేలింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి భర్తను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. జయశ్రీ తల్లిదండ్రులు తమ కుమార్తెని భర్త సుబ్రమణి హత్య చేశాడని ఆరోపణలు చేస్తున్నారు.