- వచ్చిన కార్యం మరచి పాలకులపై ప్రశంసలు
తెలుగు సినీ ప్రముఖులు తమ వైఖరిని ఏ రోజుకారోజు భలే మార్చేస్తారు. రాజకీయ నాయకులన్నా అన్ని రంగులు మార్చరేమో కానీ వీరేమో భలే మారుస్తారు. ఈ రోజు ఈ మాట అంటారు. రేపు మరో మాట అంటారు. పూటకో మాట మారుస్తూ తన నటనను సినిమాల్లోనే కాక నిజ జీవితంలోనూ కూడా చూపిస్తున్నారు. వచ్చిన కార్యక్రమాన్ని మరచి పాలకులను పొగడడమే పనిగా పెట్టుకున్నారు. ఇది తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారికే సాధ్యం. తమిళ, కన్నడ సినీ పరిశ్రమకు చెందిన వారికి భిన్నంగా వీరు ప్రవర్తిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు ప్రసన్నం చేసుకోవడానికి తెగ ప్రయత్నిస్తున్నారు. వారికి కావాల్సిన పనుల కోసం.. లేదా తమ భవిష్యత్కు ఎక్కడా ఆటంకం వస్తుందనే భయంతో వారు తమ సొంత అభిప్రాయాలను చంపుకొని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. ఈ పద్ధతి రెండు రాష్ట్రాల్లో తెలుగు సినీ ప్రముఖులు కొనసాగిస్తున్నారు.
ఈ విషయం తెలంగాణ ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ స్వారీ తెలుగు మహాసభలకు పాల్గొన్న సినీ ప్రముఖులు మాట్లాడిన తీరు చూస్తే తెలుస్తోంది. వారు అక్కడ ప్రవర్తించిన పద్ధతి చెప్పకనే చెబుతోంది. మహాసభల్లో పాల్గొన్న తెలుగు సినీ ప్రముఖులు వచ్చి తెలుగు గురించి మాట్లాడకుండా తెలంగాణ ప్రభుత్వాన్ని పొగడడమే పనిగా పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్కు, మంత్రి కేటీఆర్ను పొగడడమే పనిగా పెట్టుకున్నారు. చిరంజీవి, అక్కినేని నాగార్జున, దగ్గుబాటి వెంకటేశ్, జగపతిబాబు, బ్రహ్మానందం, మంచు మోహన్బాబు తదితర ప్రముఖులు పాల్గొని తెలంగాణ ప్రభుత్వంపై పొగడ్తల వర్షం కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను విమర్శించిన వారందరూ ఇప్పుడు కేసీఆర్ను నెత్తికెక్కించుకున్నారు. అప్పుడు తమ సినిమా ఆడనీయలేదని మండిపడిన సినీ ప్రముఖులు నేడు కేసీఆర్ మహానీయుడు, కారణజన్ముడు అని పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. తెలంగాణ మాగాణం అని కీర్తిస్తున్న వారందరూ ఉద్యమ సమయంలో విమర్శించిన వారే. ఇప్పుడు కేసీఆర్ సినీ అభిమానం కోసం తాపత్రయ పడుతుండడంతో సినీ పరిశ్రమకు చెందిన వారు కూడా ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. ఇక ఏపీ నంది అవార్డులు ప్రకటించిన తీరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన సమయంలో తమకు ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని భయంతో ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు.
ఇక ఏపీలో కూడా అదే పరిస్థితి ఉంది. ఏపీలో చంద్రబాబు నాయుడుకు సినీ పరిశ్రమకు సత్సబంధాలు ఉన్నాయి. సొంత బామ్మర్ది బాలకృష్ణ ప్రముఖ హీరోగా ఉన్నాడు. ఇంకా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన వారు తెలుగు దేశం పార్టీలో ఉన్నారు. ఏపీలో వ్యాపారాల కోసం, అనుమతుల కోసం ఏదో ఒక పని కోసం చంద్రబాబు నాయుడుతో పని ఉండడంతో చంద్రబాబుపై ఎవరూ విమర్శించడం లేదు. ప్రత్యేక హోదా కోసం విశాఖ బీచ్లో నిర్వహించిన ఆందోళనకు తెలుగు సినీ పరిశ్రమకు చెందినవారు ఎవరూ మద్దతు పలకలేదు.