నిదహస్ టీ20 టోర్నీలో భాగంగా టీమిండియా నేడు బంగ్లదేశ్ తో తలపడనుంది. ఇప్పటికే రెండు విజయాలతో, నెట్ రన్ రేట్ లో మెరుగ్గా ఉన్న టీమిండియా ఫైనల్ లో ప్రవేశించింది. నేటి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై విజయం సాధిస్తే సమీకరణాలతో సంబంధం లేకుండా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంతో టోర్నీ ఫైనల్ చేరుతుంది.
సీనియర్లు లేకుండానే బరిలోకి దిగిన టీమిండియా లంకతో జరిగిన మొదటి మ్యాచ్లో ఓటమిని చవిచూసింది. తర్వాత పుంజుకొని బంగ్లా, లంకపై విజయం సాధించింది. ఫైనల్ బెర్త్ ఖరారు చేసుఓవడానికి బంగ్లాతో తలపడనుంది. మ్యాచ్లో గెలిస్తే రన్రేట్తో సంబధంలేకుండా ఫైనల్ చేరుతుంది. లేని పక్షంలో నేటి మ్యాచ్ లో బంగ్లా జట్టు విజయం సాధించి, శ్రీలంక చేతిలో ఓడితే జట్లన్నీ నాలుగేసి పాయింట్లతో రన్ రేట్ ఆధారంగా ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంటాయి. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లో విజయం సాధించడం రెండు జట్లకు చాలా అవసరం.
అయితే భారత జట్టు ఎటువంటి ప్రయోగాలకు పోకుండా గత మ్యాచ్ లో ఆడిన జట్టునే టీమిండియా బరిలో దించాలని భావిస్తోంది. ఫాంలో లేని రోహిత్ నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి, లోకేష్ రాహుల్ ను ఓపెనర్ గా పంపాలన్న ఆలోచనలో ఉన్నారు.
ఇక ప్రధాన బౌలర్ జయదేవ్ ఉనద్కత్ ధారాళంగా పరుగులివ్వడం జట్టును ఆందోళనకు గురి చేస్తోంది. శార్థుల్ ఠాకుర్, వాషింగ్టన్ సుందర్, శంకర్, చాహల్ రాణిస్తుండడంతో టీమిండియా బౌలింగ్ విభాగంలో ఫర్వాలేదనిపిస్తోంది. మరోవైపు భారత్ ను ఓడించాలన్న లక్ష్యంతో ముష్ఫికర్ బృందం బరిలో దిగనుంది. ఆతిథ్య శ్రీలంకతో మ్యాచ్ లో విజయం సాధించిన ఉత్సాహంతో ఆ జట్టు బరిలో దిగుతోంది. తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్ దాస్, ముష్ఫికర్ రహీమ్ లపై ఆ జట్టు భారమేసింది. ఇప్పటికే నిరూపించుకున్న ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, స్పిన్నర్ మెహదీ హసన్ లు రాణించాలని బంగ్లాదేశ్ కోరుకుంటోంది. భారీగా పరుగులిస్తున్న తస్కిన్ అహ్మద్ స్థానంలో అబు జయేద్ను, బ్యాట్స్మన్ షబ్బీర్ బదులు ఆరిఫుల్ హక్ను ఎంచుకోవచ్చు.
తుది జట్లు (అంచనా)
భారత్: రోహిత్ శర్మ (కెప్టెన్), ధావన్, రైనా, రాహుల్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, వాషింగ్టన్ సుందర్, చహల్, శార్దుల్ ఠాకూర్, జైదేవ్ ఉనాద్కట్.
బంగ్లాదేశ్: మహ్ముదుల్లా (కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, లిటన్దాస్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్/ఆరిఫుల్ హక్, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్, తస్కిన్ అహ్మద్/అబు జయేద్, మెహదీ హసన్, నజ్ముల్ ఇస్లాం