ఐపీఎల్ 2018 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మరోసారి పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అగ్రస్థానాన్ని చేజిక్కించుకుంది. ఆర్సీబీ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని సీఎస్కే ఆడుతూ పాడుతూ 18.0 ఓవర్లలో ఛేదించింది. ఫలితంగా ఈ సీజన్లో ఆర్సీబీపై మరోసారి చెన్నై పైచేయి సాధించింది.
మ్యాచ్లో కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (31 నాటౌట్: 23 బంతుల్లో 1×4, 3×6), అంబటి రాయుడు (32: 25 బంతుల్లో 3×4, 2×6) దూకుడుగా ఆడటంతో మరో 12 బంతులు మిగిలి ఉండగానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు 128/4తో అలవోకగా ఛేదించేసింది. తాజా విజయంతో చెన్నై ప్లే ఆఫ్కు చేరువ కాగా, ఆర్సీబీ తన ప్లే ఆఫ్ ఆశలను మరింత సంక్లిష్టం చేసుకుంది.
అంతకముందు రవీంద్ర జడేజా (3/18), హర్భజన్ సింగ్ (2/22) పొదుపు బౌలింగ్ చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 127 పరుగులకే పరిమితమైంది. ఆర్సీబీ ఆటగాళ్లలో పార్ధీవ్ పటేల్(53;41 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ సౌతీ(36 నాటౌట్; 26 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్)లు మాత్రమే రెండంకెల స్కోరును దాటగా మిగతా ఆటగాళ్లంతా ఘోరంగా విఫలమయ్యారు. బ్రెండన్ మెకల్లమ్(5), విరాట్ కోహ్లి(8), డివిలియర్స్(1), మన్దీప్ సింగ్(7), గ్రాండ్ హోమ్(8), మురుగన్ అశ్విన్(1), ఉమేశ్ యాదవ్(1) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరారు తాజా సీజన్లో చెన్నై చేతిలో బెంగళూరు ఓడిపోవడం ఇది రెండోసారి.