టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో సత్తా చాటాడు. 2020 ఏడాది ముగింపు సందర్భంగా గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ను ప్రకటించింది. తాజా ఆస్ట్రేలియా పర్యటనలో రెండు అర్థ సెంచరీలతో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ కోహ్లి 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. గాయం కారణంగా ఈ పర్యటనకు దూరంగా ఉన్న హిట్మ్యాన్ రోహిత్ శర్మ 842 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
బాబర్ అజమ్(837), రాస్ టేలర్(818), ఆరోన్ ఫించ్(791) పాయింట్లతో వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచారు. ఇక భారత్తో జరిగిన వన్డే సిరీస్లో వరుసగా రెండు సెంచరీలతో రాణించిన ఆసీస్ ఆటగాడు స్టీవ్ స్మిత్ చాలారోజుల తర్వాత టాప్ 20లోకి అడుగుపెట్టగా.. ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కూడా టాప్ 20లో చోటు దక్కించుకున్నాడు. ఇక ఆసీస్ టూర్లో బ్యాట్ ఝళిపించిన టీమిండియా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 555 పాయింట్లతో 49వ స్థానంలో నిలిచి కెరీర్ బెస్ట్ అందుకున్నాడు.
ఇక బౌలింగ్ విభాగంలో న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ 722 పాయింట్లతో తొలి స్థానంలో నిలిచాడు బంగ్లా బౌలర్ ముజీబుర్ రెహమాన్ 701 పాయింట్లతో రెండో స్థానం.. టీమిండియా స్పీడస్టర్ జస్ప్రీత్ బుమ్రా 700 పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో టాప్ 10లో బుమ్రా మినహా టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక ఆసీస్కు చెందిన హాజిల్వుడ్, పాట్ కమిన్స్లు ఆరు, ఎనిమిది స్థానాల్లో ఉన్నారు. కాగా, పర్యటనలో ఆస్ట్రేలియా వన్డే సిరీస్ను, టీమిండియా టీ20 సిరీస్ను సాధించిన సంగతి తెలిసిందే.
టీ20 ర్యాకింగ్స్: మూడో స్థానంలో రాహుల్
ఆస్ట్రేలియా, భారత్ మధ్య టీ20 సిరీస్ ముగిసిన అనంతరం 2020 ఏడాదికి గాను ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ను ప్రకటించింది. బ్యాటింగ్ విభాగంలో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి ఎనిమిదో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్లో భారత్ నుంచి వీరిద్దరు మినహా మరే ఆటగాడికి చోటు దక్కలేదు. ఇక డేవిడ్ మలన్ (ఇంగ్లండ్) అగ్రస్థానాన్ని నిలబెట్టుకోగా, బాబర్ అజామ్ (పాకిస్థాన్) రెండో ర్యాంకులో ఉన్నాడు. బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్తాన్ బౌలర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో భారత్ నుంచి ఒక్క బౌలర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోయాడు.