క్రికెట్ చరిత్రలో భారత్ , పాక్ మ్యాచ్లంటే చెప్పాల్సిన పనిలేదు. పాక్తో మ్యాచ్ల విషయంలో జూనియర్ జట్టైనా, సీనియర్ జట్టైనా ఆ కిక్కేవేరు. దాయాది దేశాల మధ్య మ్యాచ్ ఉందంటే చాలు యావత్ క్రికెట్ అభిమానులు టీవీలకు అతుక్కు పోతారు. పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడకున్నా ఐసీసీ నిర్వహించే సిరీస్లల్లో భారత్ , పాక్ ఏదోక స్టేజీలో తలపడతాయి.
తాజాగా మరో సారి క్రికెట్ లో చిరకాల శత్రువులైన భారత్, పాకిస్థాన్ మధ్య మంగళవారం న్యూజిలాండ్ లో కీలకమైన పోరాటం సాగనుంది. అండర్ 19 వరల్డ్ కప్ లో భాగంగా క్రీస్ట్ చర్చ్ లోని హాగ్లీ ఓవల్ మైదానంలో ఇండియా, పాక్ లు సెమీఫైనల్ మ్యాచ్ లో తలపడనున్నాయి. భారత కాలమానం ప్రకారం, రేపు తెల్లవారుజామున 3 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
ఇక భారత్, పాక్ క్రికెట్ మ్యాచ్ అంటే, అది ప్రధాన టీమ్ ఆడినా, బుడ్డోళ్లు ఆడినా ఒకటేనని ఈ మ్యాచ్ కి అమ్ముడైన టికెట్ల సంఖ్యే తెలుపుతోంది. స్టేడియం కెపాసిటీ మొత్తం పూర్తయిందని, అభిమానుల నుంచి వచ్చే డిమాండ్ ను బట్టి అదనపు స్టాండ్ ఏర్పాటుకు వీలుందని స్టేడియం నిర్వాహకులు ప్రకటించారు. కాగా, తొలి సెమీస్ లో పసికూన ఆఫ్గనిస్థాన్, ఆస్ట్రేలియాను దాదాపు ఓడించినంత పని చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 4 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేయగా, ఆఫ్గన్ జట్టు 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఇక, భారత్, పాక్ మ్యాచ్ విజేతతో ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ ఆడనుంది.