ఉప్పల్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి బోణీ కొట్టింది. కేదార్ జాదవ్ (81 నాటౌట్), ధోనీ (59 నాటౌట్) అర్ధ సెంచరీలతో భారత్ను గెలిపించారు. ఆస్ట్రేలియా నిర్దేశించిన 237 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల నష్టపోయి 48.2 ఓవర్లకే ఛేదించింది. విరాట్ కోహ్లీ (44; 45 బంతుల్లో 6×4, 1×6), రోహిత్ శర్మ (37; 66 బంతుల్లో 5×4) రాణించారు.
237 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్ 4 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. శిఖర్ ధావన్ ఎదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు. ఈ సమయంలో కోహ్లీ రోహిత్తో కలసి మ్యాచ్ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ దశలో రోహిత్-కోహ్లి రెండో వికెట్కు 74 పరుగులు జోడించారు. ధాటిగా ఉడుతున్న ఈ జోడీని అడం జంపా విడదీశారు. వరుసగా రెండు బౌండరీలు బాదిన కోహ్లి (44)ని ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు.
అనంతరం రోహిత్ (37) కూడా కాసేపటికే చెత్త షాట్ ఆడి ఔటయ్యాడు. క్రీజ్లో కుదురుకుంటున్న అంబటి రాయుడు (13)ను ఔట్ చేసిన జంపా మరోసారి దెబ్బతీశాడు. దీంతో ఓ దశలో 80/1తో పటిష్టంగా కనిపించిన భారత్ 20 పరుగుల తేడాలో మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఎంఎస్ ధోనీ (59)తో అండతో కేదార్ జాదవ్ (81) చెలరేగాడు. మొదట్లో ఈ జోడీ ఆచితూచి ఆడింది. అందివచ్చిన బంతుల్ని బౌండరీకి తరలించింది. వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ భారత్ను గెలిపించారు. ఈ క్రమంలో ఇద్దరూ ఆఫ సెంచరీలు చేయడంతో ఇండియా విజయం సాధించింది.
అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 236 రన్స్ చేసింది. ఆసిస్ను ఆదిలోనే బూమ్రా దెబ్బతీశాడు. సున్నా స్కోరుకే ఫించ్ డకౌట్ అయ్యాడు.ఖవాజా (76 బంతుల్లో 50), స్టోయినిస్ (53 బంతుల్లో 37) ఆసీస్ను ఆదుకున్నారు. వీరిద్దరూ రెండో వికెట్కు 87 పరుగులు జోడించారు. మ్యాక్స్వెల్ (51 బంతుల్లో 40) ఫర్వాలేదనిపించాడు. భారత బౌలర్లలో షమీ, బుమ్రా కుల్దీప్లు చెరో రెండు వికెట్లు పడగొట్టారు.