ఇంగ్లాండ్తో నాటింగ్హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో భారత్ జట్టు భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. మ్యాచ్లో రెండో రోజైన ఆదివారం ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 124/2తో నిలిచి మ్యాచ్పై పూర్తి స్థాయిలో పట్టు బిగించింది. క్రీజులో చతేశ్వర్ పుజారా (33), విరాట్ కోహ్లి (8) ఉండగా.. తొలి ఇన్నింగ్స్లో లభించిన 168 పరుగుల ఆధిక్యంతో కలుపుకుని ఇప్పుడు భారత్ 292 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.
అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్లో 38.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. బట్లర్ (39; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్స్కోరర్గా నిలిచాడు. ఒక దశలో 54/0తో ఉన్న ఇంగ్లండ్ ఒక్క సెషన్లోనే 115 పరుగులు చేసి 10 వికెట్లు కోల్పోవడం విశేషం. హార్దిక్ పాండ్యా (5/28) కేవలం 29 బంతుల వ్యవధిలో 5 వికెట్లు తీసి సంచలన ప్రదర్శన నమోదు చేశాడు.
ఈరోజు ఓవర్ నైట్ స్కోరు 307/6 భారత్ ఇన్నింగ్స్ను కొనసాగించిన రిషబ్ పంత్ (24: 51 బంతుల్లో 2×4, 1×6) ఆరంభంలోనే పెవిలియన్ చేరిపోగా.. అశ్విన్ (14), ఇషాంత్ శర్మ (1), మహ్మద్ షమీ (3), జస్ప్రీత్ బుమ్రా (0) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో.. 94.5 ఓవర్ల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్కు తెరపడింది.
భారత్ ఆలౌటైన తర్వాత తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ ఆరంభంలో మెరుగ్గా ఆడినట్లు కనిపించిన.. క్రమంగా తడబడుతూ వచ్చింది. ఓపెనర్లు అలిస్టర్ కుక్ (29), జెన్నింగ్స్ (20) తొలి వికెట్కి 54 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కానీ.. లయ అందుకున్న భారత బౌలర్లు చెలరేగడంతో.. అదే ఇంగ్లాండ్ జట్టు పేకమేడని తలపిస్తూ పెవిలియన్కి క్యూ కట్టింది. జట్టు స్కోరు 54 వద్దే వరుసగా ఓపెనర్లు ఔటవగా.. అనంతరం జో రూట్ (16), పోప్ (10), బెయిర్స్టో (15), బెన్స్టోక్స్ (10), క్రిస్వోక్స్ (8), ఆదిల్ రషీద్ (5), స్టువర్ట్ బ్రాడ్ (0) భారత బౌలర్ల ధాటికి చేతులెత్తేశారు.
ఆఖర్లో జోస్ బట్లర్ (39: 32 బంతుల్లో 3×4, 2×6) కాసేపు దూకుడుగా ఆడినా.. అతని జోరుకి బుమ్రా కళ్లెం వేసి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కి తెరదించాడు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 5/28తో మెరవగా.. బుమ్రా, ఇషాంత్ చెరో రెండు వికెట్లు, షమీ ఒక వికెట్ పడగొట్టాడు.