వెస్టిండీస్తో జరుగుతున్న టీ20 సిరీస్లో వరుసగా రెండు మ్యాచ్లు గెలిచి భారత్ సిరీస్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20కి భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. త్వరలో ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో టాప్ బౌలర్లకు విశ్రాంతి కల్పించాలని నిర్ణయించింది . ఇప్పటికే సిరీస్ గెలవడంతో కీలకమైన బౌలర్లకు విశ్రాంతినిచ్చారు. ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్లకు రెస్ట్ ఇచ్చినట్లు బోర్డు వెల్లడించింది.
చివరి టీ20 మ్యాచ్ కోసం సిద్ధార్థ్ కౌల్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ఇక స్టాండిన్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ మూడో టీ20లో మరో అరుదైన రికార్డుపై కన్నేశాడు. ఇప్పటికే ఇండియా తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్గా నిలిచిన రోహిత్.. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యధిక పరుగుల వీరుడిగా నిలవడానికి కేవలం 69 పరుగుల దూరంలో ఉన్నాడు.
రెండో టీ20లో సెంచరీ ద్వారా న్యూజిలాండ్కు చెందిన కొలిన్ మన్రో అత్యధిక సెంచరీల (3) రికార్డును రోహిత్ బీట్ చేసిన సంగతి తెలిసిందే. రోహిత్కిది నాలుగో సెంచరీ. ఇప్పుడు అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్మన్గా నిలవడానికి మరో న్యూజీలాండర్ మార్టిన్ గప్టిల్ను వెనక్కి నెట్టాల్సి ఉంది. ప్రస్తుతం రోహిత్ 2203 పరుగులతో రెండోస్థానంలో ఉన్నాడు. ఒకవేళ రోహిత్ ఈ ఘనత సాధిస్తే.. తొలిసారి అన్ని ఫార్మాట్లలో ఇండియాకు చెందిన ప్లేయర్సే టాప్ స్కోరర్లుగా ఉంటారు. టెస్టులు, వన్డేల్లో సచిన్ టెండూల్కర్ అత్యధిక పరుగులు సాధించిన విషయం తెలిసిందే.
రంజీల్లో పంజాబ్ తరపున కౌల్ అద్బుతంగా రాణించడంతో సెలక్టర్లు అవకాశం కల్పించారు. ఇక భారత్ తరపున మూడు అంతర్జాతీయ వన్డేలు, 2 టీ20లు ఆడిన కౌల్.. వన్డేల్లో ఒక్క వికెట్ కూడా తీయనప్పటికి టీ20ల్లో 3 వికెట్లు తీశాడు. నవంబర్ 21 నుంచి ప్రారంభమయ్యే ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగానే ఈ ముగ్గురు బౌలర్లకు విశ్రాంతి కల్పించినట్లు తెలుస్తోంది. ఆదివారం చెన్నై వేదికగా జరిగే మూడో టీ20 జరగనుంది.