పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ సునీల్ నరైన్ (55 నాటౌట్: 29 బంతుల్లో 7×4, 2×6) దూకుడుగా ఆడి మెరుపు అర్ధశతకం బాదడంతో 10 ఓవర్లు ముగిసే సమయానికి కోల్కతా 106/1తో నిలిచింది.
అతనితో పాటు క్రీజులో రాబిన్ ఉతప్ప (23 నాటౌట్: 15 బంతుల్లో 2×4, 1×6) ఉన్నాడు. అంతకముందు ఓపెనర్ క్రిస్లిన్ పేలవ రీతిలో వికెట్ చేజార్చుకున్నాడు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ వేసిన పంజాబ్ బౌలర్ ఆండ్రూ టై బౌలింగ్లో బంతిని హిట్ చేసేందుకు క్రిస్లిన్ (27: 17 బంతుల్లో 2×4, 2×6) ప్రయత్నించగా.. అనూహ్యంగా బౌన్స్ అయిన బంతి అతని శరీరాన్ని తాకి వికెట్లపై పడింది.
టోర్నీలో ఇప్పటి వరకు 10 మ్యాచ్లాడిన పంజాబ్ జట్టు ఆరింట్లో గెలుపొంది పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతుండగా.. 11 మ్యాచ్లాడిన కోల్కతా జట్టు ఐదు మ్యాచ్ల్లో విజయం సాధించి ఐదో స్థానంలో ఉంది. సీజన్లో ప్లేఆఫ్ ఆశలు నిలవాలంటే.. ఈ మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ తప్పక గెలవాల్సి ఉంది.
పేలవ బ్యాటింగ్ కారణంగా గత రెండు మ్యాచ్ల్లోనూ ఓడిన ఆ జట్టు.. పంజాబ్ సొంత మైదానం ఇండోర్ వేదికగా ఈ మ్యాచ్లో ఢీకొట్టబోతోంది. హిట్టర్ ఆండ్రీ రసెల్, నితీశ్ రానా ఫామ్ కోల్పోవడం కోల్కతా జట్టుని ఇబ్బందుల్లోకి నెడుతుండగా.. ఓపెనర్లు కేఎల్ రాహుల్, క్రిస్గేల్ సూపర్ ఫామ్లో ఉండటం పంజాబ్ జట్టులో ఉత్సాహం నింపుతోంది.