ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా కింగ్స్ పంజాబ్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 22 పరుగుల తేడాతో విజయం సాధించింది. గెలుపు ఖాయమనున్న మ్యాచ్ను పంజాబ్ చేజార్చుకుంది. 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 138 పరుగులే చేయగలిగింది. సర్ఫరాజ్ఖాన్ 67 పరుగులతో ( 59 బంతులు.. 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేసినా పంజాబ్కు విజయాన్ని అందించలేకపోయాడు. చెన్నై బౌలర్లలో హర్భజన్ సింగ్, కుగ్లీన్లు తలో రెండు వికెట్లు సాధించగా, దీపక్ చాహర్కు వికెట్ దక్కింది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 160 పరుగులు చేసింది. ఓపెనర్లు వాట్సన్, డుప్లెసిస్ తొలి వికెట్కు 56 పరుగులు జోడించారు. వాట్సన్ 24 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 26 పరుగులు చేసి అశ్విన్ బౌలింగ్లో అవుటయ్యాడు. రైనాతో కలిసి డుప్లెసిస్ స్కోరు వేగం పెంచాడు. ఈక్రమంలో అశ్విన్ వేసిన 14వ ఓవర్లో వరుస బంతుల్లో డుప్లెసిస్(54), రైనా(17) ఔటయ్యారు. ఆ తర్వాత ధోనీ, రాయుడు కలిసి 60 పరుగుల అజేయ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ధోనీ 23 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్సర్తో 37 పరుగులు చేయగా.. రాయుడు 15 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్తో 21 పరుగుల చేశాడు. పంజాబ్ కెప్టెన్ అశ్విన్ 3 వికెట్లు తీశాడు.