బెంగళూరులో జరిగిన తొక్కిసలాటకు ఆర్సీబీనే కారణమని కర్ణాటక హైకోర్టుకు నివేదిక సమర్పించింది ప్రభుత్వం. ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీ సందర్భంగా చెన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 11మంది అభిమానులు మరణించిన సంగతి తెలిసిందే.
విజయోత్సవ ర్యాలీకి వచ్చే జనసమూహంపై అంచనా లేకపోవడం, ఈవెంట్, నియంత్రణ చర్యలకు సంబంధించి కీలకమైన సమాచారం లేకపోవడంతో పోలీసులు అనుమతి నిరాకరించారు. అయితే ప్రతిపాదన తక్కువ సమయంలోనే పంపడంతో .. తగినవిధంగా విశ్లేషించలేదని పేర్కొంది.
జూన్ 4న ఆర్సిబి ఏకపక్షంగా ర్యాలీ చేపడుతున్నట్లు ఉదయం 7.01 గంటల నుండి సోషల్మీడియాలో పోస్టుల్లో ప్రకటించింది. సాయంత్రం 5.00గంటలకు ర్యాలీ ప్రారంభం కానుందని చెప్పడంతో లక్షల సంఖ్యలో ప్రజలు చినస్వామి స్టేడియంకు చేరుకున్నారు. లైసెన్సింగ్ అండ్ కంట్రోలింగ్ ఆఫ్ అసెంబ్లీస్ అండ్ ప్రొసెషన్స్ (బెంగళూరు సిటీ) ఆర్డర్,2009 ప్రకారం నిర్వాహకులు ముందస్తు పోలీసుల అనుమతి తీసుకోలేదని నివేదిక స్పష్టం చేసింది. కేవలం సమాచారం ఇవ్వడం, బెంగళూరులో భారీ బహిరంగ సభలకు సంబంధించి అనుమతి తీసుకోవడం ఒకటి కాదని తేల్చిచెప్పింది.
