ఐపీఎల్ 2018 సీజన్లో ప్లేఆఫ్ ఆశల్ని అద్భుత విజయంతో కోల్కతా నైట్రైడర్స్ సజీవంగా ఉంచుకుంది. కశ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఈడెన్ గార్డెన్లో రాజస్తాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రాజస్తాన్ నిర్దేశించిన 143 పరుగుల లక్ష్యాన్ని కేకేఆర్ నాలుగు వికెట్లు కోల్పోయి 18 ఓవర్లలో ఛేదించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్కి జోస్ బట్లర్ (39: 22 బంతుల్లో 5×4, 2×6), రాహుల్ త్రిపాఠి (27: 15 బంతుల్లో 4×4, 1×6) మెరుపు ఆరంభాన్నిచ్చినా.. మిడిల్ ఓవర్లలో కోల్కతా బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 19 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులకే కుప్పకూలిపోయింది. తన నాలుగు ఓవర్ల బౌలింగ్ కోటాలో కుల్దీప్ 20 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లతో రాజస్తాన్ను దెబ్బ తీశాడు. అతనికి జతగా ఆండ్రీ రస్సెల్, ప్రసిధ్ కృష్ణలు చెరో రెండు వికెట్లు సాధించగా, మావి, సునీల్ నరైన్ తలో వికెట్ తీశారు.
ఛేదనలో ఓపెనర్ సునీల్ నరైన్ (21: 7 బంతుల్లో 2×4, 2×6) తొలి ఓవర్లోనే 21 పరుగులు బాది శుభారంభమివ్వగా.. మధ్య ఓవర్లలో నితీశ్ రాణా (21: 17 బంతుల్లో 2×4, 1×6) సమయోచిత ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. ఆఖర్లో క్రిస్లిన్ ఔటైనా.. ఆండ్రీ రసెల్ (11 నాటౌట్: 5 బంతుల్లో 2×4)తో కలిసి మరో 12 బంతులు మిగిలి ఉండగానే దినేశ్ కార్తీక్ సిక్స్తో గెలుపు లాంఛనాన్ని 145/4గా పూర్తి చేశాడు. తాజా విజయంతో (14 పాయింట్లు) పట్టికలో కోల్కతా తన మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. రాజస్థాన్ ప్లేఆఫ్ ఆశల్ని సంక్లిష్టం చేసుకుంది.