టీమిండియా బౌలర్ మహ్మద్ సిరాజ్ భావోద్వేగానికి లోనయ్యాడు. తనకు తండ్రి లేని లోటు తీర్చలేనిది అని, ఆస్ట్రేలియా గడ్డపై తన ప్రదర్శనను ఆయనకే అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. వికెట్ తీసిన ప్రతిసారీ నాన్నే గుర్తుకు వచ్చాడంటూ ఉద్వేగానికి లోనయ్యాడు. ఆసీస్తో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా సంప్రదాయ క్రికెట్లో అరంగేట్రం చేసిన ఈ హైదరబాద్ బౌలర్.. సిరీస్లో మొత్తంగా 13 వికెట్లు తీసి అదరగొట్టాడు.
గురువారం స్వదేశానికి తిరిగి వచ్చిన సిరాజ్.. నేరుగా తండ్రి మహ్మద్ గౌస్ సమాధి వద్దకు వెళ్లాడు. ఆయనను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించాడు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. ఐపీఎల్ ద్వారా మంచి అనుభవం లభించిందని, ఆర్సీబీ, విరాట్ కోహ్లి తనను ప్రోత్సహించారన్నాడు. ఆసీస్ పర్యటనతో సంతోషంగా సాగిందని, నాన్న కలను నెరవేర్చాలని పట్టుదలగా ఆడినట్లు తెలిపాడు. సీనియర్లు లేకపోయినా ఒత్తిడికి లోనుకాకుండా ముందుకు సాగాలని నిర్ణయించుకున్నామని, సారథి అజింక్య రహానే యువ ఆటగాళ్లపై నమ్మకం ఉంచి ముందుకు నడిపించాన్నడన్నాడు.
ఆసీస్ టూర్ ఎప్పటికీ గుర్తుండి పోతుందని, మార్నస్ లబుషేన్ వికెట్ తీయడం ప్రత్యేకంగా గుర్తుండిపోతుందని సిరాజ్ చెప్పాడు. ఆసీస్ విజయం ఆత్మవిశ్వాసం నింపిందని, ఇంగ్లండ్తో జరుగబోయే సిరీస్కు సిద్ధమవుతానని చెప్పాడు. ఇక మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి చనిపోయిన సమయంలో తల్లి, కుటుంబ సభ్యులు, స్నేహితులతో పాటు తనకు కాబోయే భార్య కూడా అండగా నిలిచిందని పేర్కొన్నాడు. తనను అభిమానిస్తున్న వాళ్లకు ధన్యవాదాలు చెప్పాడు.