వన్డేల్లో ముక్కోణపు పోరాటాలు మామూలే. ఐతే ఇప్పుడు కొత్తగా టీ20ల్లోనూ ముక్కోణపు సిరీస్లు మొదలయ్యాయి. ఇటీవలే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ పొట్టి క్రికెట్లో తలపడ్డాయి. ఇప్పుడు భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్ టీ20ల్లో ముక్కోణానికి సిద్ధమయ్యాయి. కీలక ఆటగాళ్లు దూరమై కుర్రాళ్లతో నిండినప్పటికీ సిరీస్లో భారతే ఫేవరెట్ అనడంలో సందేహం లేదు. కోహ్లి లేని నేపథ్యంలో భారత్ రోహిత్ శర్మ నాయకత్వంలో ఈ సిరీస్ ఆడనుంది
తొలి మ్యాచ్లోనే ఆతిథ్య శ్రీలంకని ఢీకొట్టనున్న భారత్ జట్టు టోర్నీలోనే ఫేవరెట్గా బరిలోకి దిగుతోందని మాజీ క్రికెటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే.. ఈ ఫేవరెట్ ట్యాగ్ని జట్టు తాత్కాలిక కెప్టెన్ రోహిత్ శర్మ కొట్టిపారేశాడు. ఒక ఓవర్ వ్యవధిలోనే టీ20 మ్యాచ్ స్వరూపం మారిపోతుందని.. ఏ జట్టుకైనా గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉంటాయని రోహిత్ వెల్లడించాడు. ఈ టోర్నీలో భారత్, శ్రీలంకతో పాటు బంగ్లాదేశ్ కూడా పోటీపడుతోంది.
టీ20ల్లో ఏ జట్టుకైనా విజయావకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఓవర్ వ్యవధిలోనే మ్యాచ్ గమనం పూర్తిగా మారిపోవడం ఈ ఫార్మాట్లో సర్వసాధారణం. భారత జట్టు ఫేవరెట్.. అవునా..? కాదా..? అని నేను ఆలోచించడం లేదు. టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని మాత్రమే ఆశిస్తున్నా’ అని రోహిత్ శర్మ వివరించాడు. ఈరోజు రాత్రి 7 గంటల నుంచి మ్యాచ్ జరగనుంది.