ఐపీఎల్ 2018 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు అసాధారణ విజయాన్ని నమోదు చేసింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో 206 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై జట్టు అంబటి రాయుడు (82: 53 బంతుల్లో 3×4, 8×6), కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని (70 నాటౌట్: 34 బంతుల్లో 1×4, 7×6) సంచలన ఇన్నింగ్స్ ఆడటంతో 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.
చివరి ఓవర్లో చెన్నై విజయానికి 16 పరుగుల కావల్సి ఉండగా.. బ్రేవో ఫోర్, సిక్స్ సాధించగా..ధోని విన్నింగ్ షాట్తో రెండు బంతులు మిగిలి ఉండగానే విజయాన్నందించాడు. దీంతో గురు-శిష్యుల పోరులో గురువే పై చేయి సాధించాడు.
ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన బెంగులూరు ఓపెనర్ విరాట్ కోహ్లీ, డీకాక్ మంచి శుభారంభాన్ని ఇచ్చారు. అయితే శార్దూల్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి కోహ్లి వెనుదిరగడంతో ఆర్సీబీ తొలి వికెట్ కోల్పోయింది. అయితే డివిలియర్స్ రాక ఇన్నింగ్స్ స్వరూపాన్నే మార్చేసింది. హర్భజన్ ఓవర్లో 2 సిక్సర్లు, ఒక ఫోర్తో జూలు విదిల్చాడు. అనంతరం తాహిర్ ఓవర్లోనూ ఇదే పునరావృతమైంది. ఈ ఓవర్లోనూ డివిలియర్స్ ఒక ఫోర్, 2 భారీ సిక్సర్లు బాదడంతో 10.4 ఓవర్లలోనే స్కోరు వంద పరుగులు దాటింది.
డివిలియర్స్, డికాక్ అర్థసెంచరీలతో కదం తొక్కడంతో బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. విరాట్ అవుట్ అయిన తర్వాత ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో ఔటవడంతో క్రీజులోకి వచ్చిన ఏబీ డివిలియర్స్.. 15వ ఓవర్ వరకూ ఆకాశమే హద్దుగా చెలరేగి చెన్నై బౌలర్లని ఉతికారేశాడు. డికాక్తో కలిసి రెండో వికెట్కి డివిలియర్స్ అభేద్యంగా 133 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో బెంగళూరు భారీ స్కోరు చేయగలిగింది.