2026లో భారత్, శ్రీలంకల్లో జరగనున్న టీ20 వరల్డ్కప్లో పాల్గొనడానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) స్కాట్లాండ్ పురుషుల జట్టుకు ఆహ్వానం పంపిందని క్రికెట్ స్కాట్లాండ్ ప్రకటించింది. ఈ ఆహ్వానాన్ని స్కాట్లాండ్ అధికారికంగా స్వీకరించినట్లు వెల్లడించింది. టోర్నమెంట్ నుంచి బంగ్లాదేశ్ వైదొలగిన నేపథ్యంలో, గ్రూప్–సీలో బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టును చేర్చనున్నట్లు ఐసీసీ ధృవీకరించింది.
క్రికెట్ స్కాట్లాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ట్రుడీ లిండ్బ్లేడ్ మాట్లాడుతూ..ఈ రోజు ఐసీసీ నుంచి మా పురుషుల జట్టు టీ20 వరల్డ్కప్లో పాల్గొంటుందా అని అడుగుతూ లేఖ అందింది. దానికి మేము అంగీకారం తెలిపాం అని చెప్పారు. ఈ ఆహ్వానం అందించినందుకు ఐసీసీకి మేము కృతజ్ఞులం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల ముందు గ్లోబల్ వేదికపై పోటీపడేందుకు ఇది మా ఆటగాళ్లకు గొప్ప అవకాశం. అలాగే, ఈ అవకాశం కొన్ని సవాళ్లతో కూడిన, అసాధారణ పరిస్థితుల కారణంగా లభించిందన్న విషయాన్ని కూడా మేము గుర్తిస్తున్నాం అని ఆమె అన్నారు.
ఇప్పటికే రాబోయే పర్యటనల కోసం తమ జట్టు కొన్ని వారాలుగా శిక్షణ తీసుకుంటోందని, స్థానిక పరిస్థితులకు అలవాటు పడేందుకు త్వరలోనే భారత్కు చేరుకునేందుకు సిద్ధమవుతున్నామని ట్రుడీ లిండ్బ్లేడ్ తెలిపారు. అద్భుతంగా ఉండబోయే ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్కప్లో పాల్గొని తమ వంతు సహకారం అందించేందుకు మా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు అని ఆమె పేర్కొన్నారు.
ఇదే విషయంపై క్రికెట్ స్కాట్లాండ్ చైర్మన్ విల్ఫ్ వాల్ష్ మాట్లాడుతూ..ఈ రోజు ఐసీసీ చైర్మన్ జైషా నుంచి ఫోన్ వచ్చి, స్కాట్లాండ్కు టీ20 వరల్డ్కప్ ఆహ్వానం లభించిందని తెలియజేశారు. మా జట్టు తరఫున దాన్ని స్వీకరించడంలో నాకు ఆనందంగా ఉంది. మా ఆటగాళ్లు సిద్ధంగా ఉన్నారు. ఈ అవకాశాన్ని అందించినందుకు ఐసీసీకి ధన్యవాదాలు అన్నారు.
