టెస్టుల్లో పొగొట్టుకొన్న నెంబర్ వన్ స్థానాన్ని కోహ్లీ మళ్లీ నిలబెట్టుకున్నాడు. ఇంగ్లండ్తో జరిగిన తొలి టెస్టు అనంతరం ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో కోహ్లీ మొదటిసారి టెస్టుల్లో నంబర్వన్ ర్యాంకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అనంతరం లార్డ్స్లో జరిగిన రెండో టెస్టులో కోహ్లీ విఫలమవ్వడంతో మళ్లీ రెండో స్థానానికి పడిపోయాడు. తాజాగా నాటింగ్హామ్లో చేసిన ప్రదర్శనకు గానూ కోహ్లీ తిరిగి నంబర్వన్ స్థానాన్ని సాధించాడు.
తాజాగా ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్లో 937 పాయింట్లతో టెస్టు నెంబర్ వన్ బ్యాట్స్మెన్గా నిలిచాడు. 929 పాయింట్లతో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ రెండో స్థానానికి పడిపోయాడు . కోహ్లీ టెస్టు కెరీర్లోనే ఇన్ని రేటింగ్ పాయింట్లు సాధించడం ఇదే తొలిసారి. అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ ప్రస్తుతం 11వ స్థానంలో నిలిచాడు. మరొక్క పాయింట్ సాధిస్తే ఆల్టైమ్ అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన టాప్ 10 ఆటగాళ్ల జాబితాలో చోటు సంపాదిస్తాడు.
మిగతా ఆటగాళ్లలో చటేశ్వర పుజారా ఆరవ స్థానంలో కొనసాగుతుండగా.. అజింక్యా రహానే 19వ, ధావన్ 22వ స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇంగ్లండ్తో మూడో టెస్టులో ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్న హార్దిక్ పాండ్యా బ్యాటింగ్లో ఎనిమిది స్థానాలు ఎగబాకి 51 వ స్థానంలో నిలవగా, బౌలింగ్లో 23 స్థానాలు మెరుగుపర్చుకొని 51వ స్థానం ఆక్రమించాడు. ఆల్రౌండర్ జాబితాలో 17వ స్థానాన్ని పాండ్యా సాధించాడు.