టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ట్వీట్ పై నెటిజన్లు మండిపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్ పాప్ స్టార్ రిహన్నా, పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్బర్గ్, మీనా హారిస్లు రైతులకు మద్దతుగా ట్వీట్లు చేశారు. అయితే అంతర్జాతీయ ప్రముఖులు దీనిపై మన దేశ క్రీడా, సినీ ప్రముఖులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల ఉద్యమం భారతదేశ సమస్య అని.. దానిని అందరూ కలిసికట్టుగా పరిష్కరించుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్తో సహా బాలీవుడ్ ప్రముఖులు కేంద్రానికి మద్దతుగా నిలుస్తున్నారు. తమ మద్దతుకు సూచికగా #IndiaTogether అనే హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో విరాట్ కూడా చేరాడు.
‘విభేదాలు తలెత్తిన ఈ సమయంలో మనం ఐకమత్యంగా ఉండాలి. రైతులు మన దేశంలో అంతర్భాగం. ప్రస్తుతం దేశంలో నెలకొన్న సమస్య పరిష్కారానికి అన్ని పార్టీలు, వర్గాలతో చర్చించి ఓ స్నేహపూర్వక చర్చలతో శాంతి నెలకొల్పేందుకు సమైక్యంగా ముందుకు వస్తారని ఆశిస్తున్నా. ఇండియాటుగెదర్’ అంటూ కోహ్లి బుధవారం రాత్రి ట్వీట్ చేశాడు. ఇక రైతు ఉద్యమాన్ని నీరుగార్చేందుకు కేంద్రం, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు చేపడుతున్న చర్యలపై ఇప్పటికే తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో క్రీడా, సినీ ప్రముఖులు కేంద్రానికి వత్తాసు పలకడం పట్ల నెటిజన్లు మండిపడుతున్నారు. కోహ్లీ ఉచిత సూచనలు మానుకోవాలని హితవు పలుకుతున్నారు. ఇటువంటి వివాదాస్పద అంశంలో ఎవరో ఒకరి వైపునే ఉండాలని, రెండు పడవలపై ప్రయాణం మంచిది కాదని అంటున్నారు. ‘రైతుల గురించి నీకు ఏం తెలుసునని మాట్లాడుతున్నావ్. నీ కంటే రిహన్నా, థన్ బర్గ్ నయం’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
మిస్టర్ కూల్ ధోనీ చరిత్ర సృష్టించాడు.
ఆ జట్టు ఒక్క టెస్టు కూడా గెలవదు.. ఇది తథ్యం!