ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన ఘోర పారాజయం చెందడంతో పవన్ పార్టీకి ట్రీట్ మెంట్ నిర్వహించారు. వచ్చె ఎన్నికల నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టం చేసేదిశగా ముందుకు కదులుతున్నారు. పార్టీని సంస్థాగతంగా మందుకు తీసుకెళ్లేందుకు.. కమిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. పార్టీలో కేడర్ పటిష్టంగా ఉన్నా.. లీడర్షిప్ సరిగా లేదని అసహనం వ్యక్తం చేశారు. ఫలితాల తర్వాత పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి అవకాశం కల్పిస్తామన్నారు.
ఇక జగన్ ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పనితీరుపై ఏడాది పాటు వేచి చూశామని, ఇప్పుడు కూడా వైసీపీ ప్రభుత్వ పనితీరుపై కొంత సమయం తీసుకుని మాట్లాడతామని అన్నారు. కొత్త ప్రభుత్వం విధి విధానాలు చూసి.. వారి పనితీరు పరిశీలించన తర్వాతే స్పందిస్తామని.. మంచి చేస్తే కచ్చితంగా హర్షిస్తామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు తలెత్తితే వాటి పరిష్కారానికి పోరాడతామని స్పష్టం చేశారు.
ఉండవల్లిలోని ప్రజావేదిక కట్టడం కూల్చివేతపై కూడా పవన్ స్పందించారు. ప్రజావేదిక ఒక్కదాన్నే కూల్చివేస్తే దానిపై అనుమానించాల్సి వస్తోందని అలా కాకుండా అక్రమ కట్టడాలను రాష్ట్ర వ్యాప్తంగా కూల్చివేస్తే దానిపై ఎలాంటి అనుమానాలు ఉండవన్నారు. వాటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేయాలని డిమాండ్ చేశారు. కరకట్టపై ఉన్న అన్ని అక్రమ కట్టడాలను కూల్చివేస్తే తాను కూడా సంతోషపడతానని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా ఏం నిర్మించిన వాటిని అడ్డుకోవాల్సిందేనని అందులో ఎలాంటి సందేహం లేదన్నారు. మరో వైపు తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ సచివాలయ భవనాలు అప్పగించడంపై ప్రభుత్వం వివరణ ఇవ్వాలన్నారు. వివరన ఇస్తే ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పెరుగుతుందన్నారు.