నామినేషన్ల పర్వం మరో రెండు రోజుల్లో ముగియనుండగా టీడీపీలో అసంతృప్తి మాత్రం చల్లారడం లేదు. టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా మైలవరం టీడీపీలో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి.
వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్కు టికెట్ ఇచ్చారు చంద్రబాబు. ఇందుకోసం పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న సీనియర్ నేత దేవినేని ఉమాకు టికెట్ ఇవ్వలేదు. ఇక వసంత పేరు ప్రకటించినప్పటి నుండి టీడీపీలో విభేదాలు చల్లారలేదు.ఎందుకంటే గత ఐదేళ్లుగా దేవినేని ఉమ, వసంత వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి.
ఇప్పుడు అదే వసంతకు టీడీపీ టికెట్ ఇవ్వడంతో ఆయన వర్గీయులు జీర్ణించుకోలేకపోయారు. చంద్రబాబు బుజ్జగించడంతో దేవినేని సైలెంట్ అయినా ఆయన అనుచరులు మాత్రం వసంతకు సహకరించేందుకు నిరాకరిస్తున్నారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం మండలం గణపవరం గ్రామంలో పర్యటించిన సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ ఎదురుగానే నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దేవినేని అనుచరుడును అవమానించడంతో సమావేశం నుంచి కొందరు మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో ఈసారి ఎన్నికల్లో వసంత గెలవడం కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.