ఎవరైనా లంచాలు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి రావాలని సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించారు. ఏసీబీ పనితీరుపై ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో ఏసీబీ పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆశించిన రీతిలో పనితీరు కనిపించడం లేదన్నారు. ఏసీబీలో అధికారులు మరింత చురుగ్గా, క్రియాశీలకంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఏసీబీలో పనిచేస్తున్న సిబ్బందికి అలసత్వం ఉండకూడదని ఆదేశించారు. అవినీతి నిరోధానికి 14400 కాల్సెంటర్ ఏర్పాటు వెనుక మంచి కారణాలు ఉన్నాయని వివరించారు. కాల్ సెంటర్ ఏర్పాటు వల్ల మంచి ఫలితాలు కనిపించాలన్నారు. ప్రజలెవ్వరూ కూడా అవినీతి బారిన పడకూడదని చెప్పారు. లంచాలు చెల్లించే పరిస్థితి ఎక్కడా ఉండకూడదన్నారు.
ఎమ్మార్వో కార్యాలయాలు, రిజిస్ట్రేషన్ కార్యాలయాలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసుల్లో ఇలా ఎక్కడా కూడా అవినీతి కనిపించకూడదన్నారు. సెలవుల్లేకుండా పనిచేయండి, మూడు నెలల్లోగా నాకు మార్పు కనిపించాలని సూచించారు. కావాల్సినంత సిబ్బందిని తీసుకోవాలన్నారు . ఎలాంటి సదుపాయాలు కావాలన్న ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, ఏసీబీ చీఫ్ విశ్వజిత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.