ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్ రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. ప్రాజెక్టు భవిత్వం రేపు తేలనుంది. పోవలరం విషయంలో జగన్ ఏనిర్ణయం తీసుకుంటారనేది ఉత్కంఠను రేపుతోంది. రేపు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సీఎం జగన్ పోలవరం పర్యటన కొనసాగనుంది. ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ప్రాజెక్టు పురోగతి పనులపై అధికారులు సీఎంకు వివరించనున్నారు.
క్షేత్రస్థాయిలో తొలి సారి పనులు పరిశీలించనున్న సీఎం… పోలవరంలో ఇరిగేషన్ పనులతో పాటు పునరావాసంపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు.ప్రజలకు పరిహారం ఇవ్వకుండా నీళ్లు నిలపడం సరికాదనే అభిప్రాయంలో జగన్ సర్కార్ ఉంది. ఇరిగేషన్ పనులు – పునరావాసం పనులు సమాంతరంగా జరగాలంటున్న వైసీపీ ప్రభుత్వం… ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ, భూ పరిహారంలో అవకతవకలు జరిగాయన్న భావనలో ఉంది.
ఇప్పటికే పోలవరంలో భారీ అవినీతి జరిగిందని ప్రతిపక్షంలో ఉన్న ప్పుడు జగన్ ఆరోపనలు చేసిన సంగతి తెలిసిందే.పోలవరం కేంద్రానికి అప్పగించాలా…? రాష్ట్రం ద్వారానే నిర్మాణం చేపట్టాలా? అనే అంశంపై కూడా విధాన నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. ఇక, పోలవరం కాంట్రాక్టర్ల విషయంలో సమీక్ష తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారనే ఉత్కంఠ నెలకొంది. దాంతో పాటు పెరిగిన పోలవరం అంచనాలపై కూడా దృష్టి సారించనున్నారు జగన్.