అసెంబ్లీ సమావేశాల్లో కృష్ణానది వెంబడి ఉన్న అక్రమ కట్టడాలపై అధికార, ప్రతిపక్ష పార్టీ సభ్యుల మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయిలో కొనసాగింది. అక్రమ నిర్మాణాల కూల్చివేతపై చర్చ జరుగుతున్న వేళ, రోడ్లపై అడ్డుగా ఉన్న విగ్రహాల ప్రస్తావనను చంద్రబాబు తేగా, సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
రోడ్ల పక్కన ఉన్న వేలాది విగ్రహాల సంగతి ఏంటి అధ్యక్షా అని చంద్రబాబు ప్రశ్నించారు. చట్ట వ్యతిరేకంగా రాజశేఖర రెడ్డివి కొన్ని వేల విగ్రహాలు పెట్టారు. అలాంటి జగన్.. అక్రమ కట్టడాల గురించి మాట్లాడుతున్నారా? అని ప్రశ్నించిన బాబు.. తన ఆవేదనంతా 74 వేల మంది పేద ప్రజానీకం గురించేనని చెప్పారు.
అయితే బాబు వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు వైసీపీ నతేలు. రాజశేఖరరెడ్డి విగ్రహాలను చంద్రబాబు చూడలేకపోతున్నారని అంత కడుపు మంట ఎందుకని.. అధికార పార్టీ నేత అంబటి రాంబాబు నిప్పులు చెరిగారు. దీనికి స్పందించిన చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘రాజశేఖర రెడ్డి విగ్రహాలతో నాకేంటి సమస్య, రాజశేఖర రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. 1977-83 మధ్య మంత్రులుగా ఉన్నాం. ఇద్దరం ఒకే గదిలో నిద్రించాం. ఇద్దరం రాజకీయంగా ప్రత్యర్థులమే కానీ శత్రువులం కాదు. ఈ విషయం జగన్కు తెలియకపోవచ్చ’’ని చంద్రబాబు వ్యాఖ్యానించారు. బాబు ఇలా మాట్లాడుతున్నప్పుడు.. జగన్ నవ్వుతూ కనిపించారు.
మా మధ్య రాజకీయ విరోధం ఉందే తప్ప, వ్యక్తిగత విరోధం లేదు. నేను తెలుగుదేశంలోకి వచ్చాను. ఆయన కాంగ్రెస్ లో ఉన్నారు. రాజకీయంగా పోరాడాం తప్ప, వ్యక్తిగతంగా కాదన్నారు.