ఏపీ శాసనసభ దద్దరిల్లింది. ‘బంట్రోతు’ వ్యాఖ్యలు దుమారం రేపాయి. స్పీకర్ ఏకగ్రీవ ఎన్నిక సందర్భంగా ప్రతిపక్ష టీడీపీ అధినేత చంద్రబాబు స్పీకర్ ను తోడ్కొని రాకుండా తనవంతుగా అచ్చెన్నాయుడును పంపడం వివాదాస్పదమైంది. దీనిపై జగన్ సహా వైసీపీ ప్రజాప్రతినిధులు ఎండగట్టారు.
అయితే చంద్రబాబు దీనిపై వివరణ ఇచ్చారు. ఏపీ శాసనసభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా అధికారపక్షం ఏకపక్షంగా వ్యవహరించిందని.. కనీసం ప్రతిపక్షమైన తమను సంప్రదించలేదని… పిలిచి మాట్లాడలేదని చంద్రబాబు దుయ్యబట్టారు. అందుకే పిలవని పేరంటానికి తాము వెళతామా అని తాను రాలేనని చంద్రబాబు వివరణ ఇచ్చారు. అంతేకాదు తన వంతుగా పంపిన అచ్చెన్నాయుడును పట్టుకొని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ‘బంట్రోతులాగా’ వచ్చాడు అని విమర్శించాడని చంద్రబాబు మండిపడ్డారు.
తాను బంట్రోతు అయితే జగన్ చేతిలోని 150 మంది ఎమ్మెల్యేలు కూడా బంట్రోతులేనని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలతో సభలో గందరగోళం నెలకొంది.
అయితే ప్రొటెం స్పీకర్ సభలోని అధికార, ప్రతిపక్షాలను స్పీకర్ ను తొడ్కొని కలిసి కట్టుగా చేయాలని కోరారని.. ఈ విషయంలో చంద్రబాబు కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నాడని మండిపడ్డారు. మీరు గతంలో చేసిన వ్యాఖ్యలతో పోల్చితే ఇవి చాలా చిన్నవని జగన్ చెప్పుకొచ్చారు.
ఇక జగన్ తొలి ప్రసంగంతోనే చంద్రబాబును టార్గెట్ చేసిన ఆయన ఫిరాయింపులను, గత సభ లో చేసిన అరాచకాలను ఎండగడుతూనే ఉన్నారు. అయితే చంద్రబాబు కూడా అంతే ధీటుగా జగన్ ను ఎదుర్కొంటుడడంతో సభలో వైసీపీ, టీడీపీ మధ్య టఫ్ ఫైట్ నెలకొంది.