విశాఖ జిల్లాలో టీడీపీ మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే ఆపరేషన్ ఆకర్ష్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న పార్టీకి మరో పిడుగులాంటి వార్తతో బాబులో కలవరం మొదలయ్యింది. విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే పార్టీని వీడేందుకు రంగం సిద్ధం అయ్యింది. గత సార్వత్రిక ఎన్నికల్లో యలమంచిలి నియోజకవర్గం నుంచి టీడీపీ టికెట్టుపై పోటీ చేసి ఓటమిపాలైన పంచకర్ల రమేష్బాబు సైకిల్ దిగి ఫ్యాన్ గాలికింద సేదదీరేందుకు సిద్ధమయ్యారు.
గత కొన్నాళ్లుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్న ఆయన రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో టచ్లో ఉంటూ పార్టీ మారేందుకు మంతనాలు జరిపినట్టు సమాచారం. అటువైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో విజయ దశమికి వైసీపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో యలమంచిలి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పంచకర్ల…వైసీపీ అభ్యర్థి కన్నబాబురాజు చేతిలో ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యకాలాపాలకు దూరంగా ఉంటున్నారు. గతంలోనె వైసీపీలో చేరుతారనె వార్తలు వచ్చినా ఆయన టీడీపీలోనె కొనసాగుతారని పచ్చ పార్టీనేతలు చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో వైసీపీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపనతో 2009లో రాజకీయ ప్రవేశం చేసిన పంచకర్ల ఆ ఎన్నిల్లో పెందుర్తి నుంచి పోటీచేసి ఎమ్మెల్యే అయ్యారు. అనంతరం పీఆర్పీ కాంగ్రెస్లో విలీనం కావడంతో కాంగ్రెస్ నాయకుడిగా మారారు. విభజన తర్వాత 2014లో టీడీపీలో చేరి యలమంచిలి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలుపొందారు. పార్టీ రూరల్ జిల్లా అధ్యక్షునిగా కూడా పనిచేశారు. మాజీ మంత్రి, విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అనుచరుడిగా పంచకర్లకు పేరుంది. ఏది ఏమైనా అధికార పార్టీ వైసీపీ మీద బాబు బుదర చల్లడం మానుకోని సొంత పార్టీపై ఫోకస్ పెడితే బాగుటుందనేది విశ్లేషకుల అభిప్రాయం.