కాలం కలిసి వచ్చి, ఈవీఎంల అక్రమాలతో వైసీపీ గెలిచిందని.. వైసీపీ ప్రజావిజయాన్ని గాలివాటంగా తీసేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటు కౌంటర్లు ఇచ్చారు. తనదైన శైలిలో విమర్శలు ఎక్కుపెట్టారు. ఇక పవన్ కు సపోర్టుగా రాజకీయం చేస్తున్న చంద్రబాబును చెడుగుడు ఆదేశారు.
తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో పవన్, చంద్రబాబులను ఏకిపారేశారు. యజమాని, ప్యాకేజీ ఆర్టిస్ట్ కలిసి ఒకే స్ట్రిప్ట్ చదువుతున్నాయని విజయసాయిరెడ్డి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు ఏమో ఎందుకు ఓడామో తెలియదంటాడు.. రెండు చోట్ల అడ్రస్ గల్లంతైన పార్టనర్ (పవన్) ఏమో కాలం కలిసొచ్చో, ఈవీఎంల చలవతోనే వైసీపీ గెలిచిందంటారు.. మరి టీడీపీ గెలిచిన ఆ 23 సీట్లలో ఆయనను, ఒక్క స్థానంలో పార్టనర్ ను ఎవరు గెలిపించారో చెప్పాలని’ పవన్ ను సూటిగా ప్రశ్నించారు విజయసాయిరెడ్డి..
ప్రజలు ఈడ్చికొడితే ఎక్కడో పడిన చంద్రబాబు హెచ్చరికలు చూస్తే భారత్ పై అణ్వాయుధాలు వేసతామంటూ పాక్ ప్రధాని ఊకదంపుడు బెదిరింపులు లాగానే కనిపిస్తున్నాయంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
మూడు నెలలు కూడ కాకముందే సీఎం జగన్ అన్నింటిలో విఫలమయ్యారని విమర్శిస్తున్నారు.. ఆ కుర్చీ ఖాళీ చేయాలని బాబు గగ్గోలు పెడుతున్నాడని విజయసాయిరెడ్డి మండిపడ్డారు. ఊసరవెల్లి సిద్ధాంతాల పార్టీ టీడీపీ అని.. మోడీని రెండోసారి పీఎం కాకుండా కుట్రపన్నిన బాబు ఇప్పుడు అదే పార్టీతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడని విజయసాయిరెడ్డి దుమ్మెత్తిపోశారు. మనుగడ కోసం చంద్రబాబు ఎవరి కాళ్లు అయినా పట్టుకుంటాడని.. ఇదే చంద్రబాబు ఫిలాసఫీ అని ట్విట్టర్ లో విజయసాయిరెడ్డి కౌంటర్ల వర్షం కురిపించారు.