జనవరి 24 నుంచి న్యూజిలాండ్తో ప్రారంభంకానున్న ఐదు టీ20ల సిరీస్ కోసం భారత్ జట్టుని ప్రకటించారు సెలక్టర్లు. ఇటీవల శ్రీలంకతో ముగిసిన టీ20 సిరీస్కి రెస్ట్ ఇచ్చిన వైస్ కెఫ్టెన్ రోహిత్ శర్మతో పాటు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ మళ్లీ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇవ్వగా.. ఆ సిరీస్లో ఫెయిలైన వికెట్ కీపర్ సంజు శాంసన్పై వేటు పడింది. ఇక ఫిట్నెస్ టెస్టులో పాసవ్వని సీనియర్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాకీ ఈ జట్టులో చోటు దక్కలేదు. న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా భారత్ జట్టు అక్కడ ఐదు టీ20లు, మూడు వన్డేలు, రెండు టెస్టుల్ని ఆడనుంది.
భారత టీ20 జట్టు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, మనీశ్ పాండే, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, నవదీప్ షైనీ, రవీంద్ర జడేజా, శార్ధూల్ ఠాకూర్.
శ్రీలంకతో టీ20లో మళ్లీ ఫాంలోకి వచ్చిన శిఖర్ ధావన్ ఎట్టకేలకి జట్టులో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. ఇక రోహిత్ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు కేఎల్ రాహుల్, రోహిత్, ధావన్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు టీమ్లో బలంగా ఉన్నారు. దీంతో తుది జట్టులో ఎవరికి అవకాశం దక్కుతుంది..? అనే ఉత్కంఠ నెలకొంది. సిరీస్లో కుడి, ఎడమ చేతివాటం ఓపెనింగ్ కాంబినేషన్ని ఆడించాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తే..? రాహుల్ రిజర్వ్ బెంచ్కి పరిమితంకానున్నాడు.