క్రికెట్ మ్యాచ్ లో సరిగ్గా బ్యాట్స్ మెన్ పాదాల వద్ద యార్కర్లు వేయడంలో భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకి తిరుగులేదనే విషయం అందరికి తెలిసిందే. అయితే క్రికెట్ ప్రపంచంలోనే అత్యుత్తమ యార్కర్ బౌలర్ శ్రీలంక పేసర్ లసిత్ మలింగా అని బుమ్రా తాజాగా కితాబిచ్చాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున మలింగ, బుమ్రా కలిసి ఆడుతుండగా.. తన బౌలింగ్ మెరుగుకి మలింగ సాయపడ్డాడని ఇప్పటికే బుమ్రా చాలాసార్లు చెప్పాడు.
ఐసీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో యార్కర్ల గురించి జస్ప్రీత్ బుమ్రా మాట్లాడుతూ..”ప్రపంచంలో అత్యుత్తమంగా యార్కర్లని సంధించగలిగే బౌలర్ లసిత్ మలింగ. అతను సుదీర్ఘకాలంగా యార్కర్ల విషయంలో సక్సెస్ అవుతున్నారు” అని బుమ్రా అన్నారు. ఇక కరోనా వైరస్ కారణంగా ఐసీసీ నిబంధనల్ని మార్చడంపై బుమ్రా స్పందిస్తూ.. రూల్స్ బ్యాట్స్ మెన్ కి అనుకూలంగా ఉన్నాయి.. బంతి మెరుపు కోసం చెమట లేదా లాలాజలాన్ని రుద్దకూడదనే కొత్త నిబంధనని బుమ్రా వ్యతిరేకించాడు.
అలానే మైదనంలో హగ్, హైఫైకి తాను ఫస్ట్ నుంచి దూరం అని అందులో ఎలాంటి సమస్య లేదు అన్నాడు. కానీ బంతికి లాలాజలాన్ని రుద్దకూడదనేది ఫాస్ట్ బౌలర్లపై ప్రభావం చూపుతుంది. స్టేడియాలు చిన్నవవుతున్నాయి.. వికెట్లు కూడా ఫ్లాట్గా మారిపోయాయి. దాంతో.. బౌలర్ వద్ద ఉన్న ఆయుధాలు స్వింగ్ లేదా రివర్స్ స్వింగ్. కానీ.. బంతిపై లాలాజలం రుద్దకపోతే.. మెరుపు కోల్పోయిన బంతి నుంచి బౌలర్ ఎలాంటి స్వింగ్ రాబట్టలేడు అని బూప్రా చెప్పుకొచ్చాడు.