యువర్ అటెన్షన్ ప్లీజ్.. దయచేసి వినండి… ట్రెయిన్ నంబర్ 22850 సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్… మరికొద్ది నిమిషాల్లో 1వ నంబర్ ప్లాట్ ఫాంపైకి రానుంది… అంటూ వచ్చే రైల్వే అనౌన్స్ మెంట్ ను వినని భారతీయులు బహుశా ఉండరేమో. అంతగా పాపులర్ అయిన ఈ వాయిస్ ఎవరిదో తెలుసా? ఆమె పేరు సరళా చౌదరి. 1982వ సంవత్సరంలో సెంట్రల్ రైల్వేలో రైల్వే అనౌన్సర్ ఉద్యోగం కోసం చాలా మంది యువతులు అప్లై చేశారు.
వాయిస్ టెస్ట్ కోసం వెళ్లిన సరళా చౌదరి గొంతు విన్న అప్పటి జీఎం అశుతోష్ బెనర్జీ ఆమెను సదరు ఉద్యోగం కోసం రికమెండ్ చేశారు. దీంతో అప్పటి నుంచి సరళా చౌదరి రైల్వే అనౌన్సర్గా ఉద్యోగం చేస్తూ వచ్చింది. అయితే ఒకప్పుడు కంప్యూటర్లు లేకపోవడంతో ప్రతి అనౌన్స్మెంట్ను ఆమె చదివి వినిపించాల్సి వచ్చేదట. అయితే కంప్యూటర్ల రాకతో రైల్వేల్లోనూ ట్రెయిన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. దీంతో సరళా చౌదరి ఒకేసారి కొన్ని వేల రికార్డింగ్స్ చేసి ఇచ్చేసింది. వాటిని సేవ్ చేసిన రైల్వే శాఖ టీఎంఎస్ అనుసంధానంతో ఆటోమేటిక్ గా అనౌన్స్మెంట్ వచ్చేలా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 49 ఏళ్ల వయసు ఉన్న ఆమె 12 సంవత్సారల క్రితమే పదవీ విరమణ చేసింది. అయినప్పటికీ ఆమె గొంతు ఇప్పటికీ రైల్వే అనౌన్స్మెంట్లలో వినిపిస్తూనే ఉంది. ఏది ఏమైనా ఇండియన్ రైల్వే ఉన్నంత కాలం ఆమె గొంతును ఎవ్వరూ మర్చిపోలేరు.