ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపిస్తూ రాజకీయాలు నడుస్తున్నాయి. వైఎస్సార్సీపీ, అధికార పార్టీ టీడీపీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా పోరాడుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్లోని నాలుగు రైల్వేస్టేషన్లను అంతర్జాతీయ ప్రమాణాల మేరకు అభివృద్ధి చేయాలని రైల్వే శాఖ నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలోని విజయవాడ, గుంటూరు రైల్వేస్టేషన్లతో పాటు రాయలసీమలోని కర్నూలు, గుంతకల్లు రైల్వేస్టేషన్లకు అంతర్జాతీయ హోదా కల్పిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రైల్వే డివిజన్ నుంచి ఒక స్టేషన్ను ఎంపిక చేసి ఆ రైల్వేస్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలు కల్పించాలనేది రైల్వే శాఖ ఉద్దేశం.
వీటిలో భాగంగా ఒక్కో స్టేషన్కు రూ.25 కోట్లు మేర కేటాయించారు. స్టేషన్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టాలో ప్రతిపాదనలు పంపాలని ఆయా డివిజన్ల అధికారులకు రైల్వేబోర్డు ఆదేశాలు జారీ చేసింది. విమానాశ్రయాల తరహాలో రైల్వేస్టేషన్లను కూడా అభివృద్ది చేయాలనే లక్ష్యంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని దేశాల్లోని రైల్వేస్టేషన్లు విమానాశ్రయాల తరహాలో సౌకర్యాలను ప్రయాణికులకు అందిస్తున్నాయి. సౌకర్యాలు కల్పించే లక్ష్యంతో బడ్జెట్లోనూ ప్రత్యేకంగా నిధులు కేటాయించారు. ఆ మేరకు స్టేషన్ల అభివృద్ధికి చర్యలు చేపట్టారు.
విజయవాడ స్టేషన్కు ఇప్పటికే ఏ1 హోదా ఉంది. కొత్త ప్రతిపాదనలతో సౌకర్యాలు మరింతగా మెరుగుపరుస్తామని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.