మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల తాజాగా తన శాసన సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. శనివారం శామీర్ పేట లోని తన ఇంటి నుంచి అనుచరులతో కలిసి గన్ పార్కుకు చేరుకున్న ఈటల ముందుగా అమరవీరుల స్థూపానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి అసెంబ్లీకి చేరుకున్న ఈటల అక్కడి స్పీకర్ కార్యాలయానికి చేరుకొని తన రాజీనామా లేఖను అందజేశారు. అయితే ఆ సమయంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అందుబాటులో లేరు. దీంతో ఈటల రాజేందర్ అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను అందించారు.
ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ కరోనా ను కారణంగా చూపుతూ స్పీకర్ కార్యాలయానికి రాలేదని, దీంతో కార్యదర్శి తన రాజీనామా లేఖ సమర్పించాల్సి వచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం సంప్రదాయాలు, చట్టాలను కూడా తుంగలో తొక్కుతోందని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత స్వేచ్ఛగా ఉందని ఈ సందర్భంగా ఈటల వ్యాఖ్యానించారు. 17 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా కొనసాగానని,ఇప్పుడు రాజీనామా చేసినట్లు తెలిపారు. తనను రాజీనామా చేయాలని ప్రజలే ఆశీర్వదించారని సందర్భంగా ఈటల చెప్పారు. టీఆర్ఎస్ తనకు బీ ఫారం ఇచ్చి ఉండొచ్చు కానీ తనను గెలిపించి మాత్రం ప్రజలేనని అన్నారు. టీఆర్ఎస్ నాయకులు ఉపఎన్నికల్లో అధికారాన్ని అడ్డంగా పెట్టుకుని గెలవాలని చూస్తున్నట్లు ఈటల ఆరోపించారు.
Also Read: ఇలా అయితే కష్టం..! చంద్రబాబు, లోకేశ్పై క్యాడర్ నిరుత్సాహం
కాగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. ఈనెల 14వ తేదీన ఆయన బీజేపీలో చేరనున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఈటల రాజేందర్ తో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్ పర్సన్ తుల ఉమ కూడా బీజేపీలో చేరనున్నారు. ఈటల చేరికపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా క్లారిటీ ఇచ్చారు. తనతో పాటుగా బీజేపీలో చేరుతున్న వారితో ఈటల రాజేందర్ ఈనెల 13వ తేదీన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో 14వ తేదీన జరిగే కార్యక్రమంలో జేపీ నడ్డా సమక్షంలో ఈటల బీజేపీలో చేరనున్నారు.
Also Read: తారక్ పొలిటికల్ ఎంట్రీపై బాలయ్య రియాక్షన్ ఇదే..!