టాలీవుడ్లో మా ఎన్నికల హడావుడి మొదలు కావడం కాదు.. ఓ రకంగా చెప్పాలంటే రచ్చ రచ్చ అవుతోంది. ప్రకాష్ రాజ్ వర్సెస్ ఆయన వ్యతిరేక వర్గం కత్తులు, డాలూ సిద్ధం చేసుకుంటున్నాయి. ప్రస్తుతం నటులంతా వర్గాలుగా విడిపోయారు. ఇక కొంతమంది మాత్రం మధ్యస్తంగా తమ పని తాము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల ప్రముఖ నటుడు, నిర్మాత, మా మాజీ అధ్యక్షుడు మురళి మోహన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ’బహుశా మా ఎన్నికలు ఉండకపోవచ్చు. ఈ సారి ఏకగ్రీవం కావచ్చు’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీంతో అంతా షాక్ అయ్యారు.
నిజానికి సెప్టెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ చిరంజీవి మద్దతుతో పోటీచేస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రకాష్ రాజ్ మాత్రం దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అప్పుడే ఆయన ప్యానెల్ను కూడా ప్రకటించేశారు. మరోవైపు నాగబాబు సైతం మా పై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రకాష్ రాజ్ దూకుడుతో ఆయన వ్యతిరేక వర్గం ఉక్కిరిబిక్కిరవుతున్నది. ఇక మా లోనూ కులాల కుంపటి మొదలైందని.. రాజకీయ పార్టీల జోక్యం మొదలైందని వార్తలు వస్తున్నాయి.
తాజాగా ప్రకాశ్ రాజ్ ఓ ట్వీట్ చేయడం.. దానికి మా అధ్యక్షుడు నరేష్ గట్టి కౌంటర్ ఇవ్వడం సంచలనంగా మారింది. ’ ఇంతకీ మా ఎన్నికలు ఎప్పుడు just asking’ అంటూ ప్రకాష్ రాజ్ ఓ ట్వీట్ పెట్టాడు. దీనికి ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్ కౌంటర్ ఇచ్చారు.’జనరల్ బాడీ మీటింగ్లో ఎన్నికలపై ఒక తీర్మానం చేద్దామనుకున్నాం. కానీ కరోనా పరిస్థితుల దృష్ట్యా జనరల్ బాడీ మీటింగ్ జరగలేదు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మా ఎన్నికలు సెప్టెంబర్లో నిర్వహిస్తామని ఇది వరకే చెప్పాం. మెయిల్ కూడా పంపించాం.
ఇప్పుడు మళ్లీ మళ్లీ అదే ప్రశ్న అడుగుతున్నారు. ఇది నీళ్లు నింపకుండానే స్విమ్మింగ్ పూల్లో దూకుతాను అన్నట్టుగా ఉంది’ కొంచెం వెయిట్ చేయండి సార్’ అంటూ నరేశ్ ట్వీట్ చేశారు. ప్రకాష్ రాజ్కు పంపించిన మెయిల్స్ కూడా పోస్ట్ చేశారు. ఈ రెండు ట్వీట్లు వైరల్ గా మారాయి. మొత్తానికి ప్రకాష్ రాజ్ కాస్త అత్యుత్సాహం కనబరుస్తున్నాడని సినీ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రకాష్ రాజ్కు పోటీగా మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ, నరసింహరావు పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
ప్రకాశ్రాజ్ అందరికంటే ముందుగానే ఎన్నికల రంగంలోకి దూకాడు. ఇప్పటికే ఆయన సీనియర్ల మద్దతు కూడగడుతున్నాడు. మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఉంది కాబట్టి ప్రకాష్ రాజ్ గెలుపు ఎంతో సులువన్న వాదన వినిపిస్తోంది. ప్రకాష్ రాజ్ లోకల్ కాదని.. ఆయన వ్యతిరేకులు ప్రచారం చేస్తున్నారు. ఇంకా ముందు ముందు ఏమేం జరుగుతోందో వేచి చూడాలి. అసలు ఎన్నికలు ఉంటాయా? లేక మురళి మోహన్ చెప్పినట్టుగానే ఏకగ్రీవం కాబోతున్నదా అంటే తెలియాలంటే ఇంకో మూడు నెలలు వెయిట్ చేయాల్సిందే.
Also Read
బాప్ రే…వెయ్యి మందితో లైగర్ క్లైమాక్స్ సీన్..!