దక్షిణాదితో తొలిసారి బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి, సుదీర్ఘ కాలం కర్ణాటక ముఖ్యమంత్రిగా పని చేసిన యడియూరప్పకు కమలం పార్టీ అధిష్టానం మరో షాక్ ఇచ్చింది. ఇప్పటికే వయస్సు కారణంగా చూపి గత ఏడాది ఆయన్ను గద్దె దింపిన అధిష్టానం తాజాగా ఆయన చిన్న కుమారుడు విజయేంద్రకు ఎమ్మెల్సీ టికెట్ నిరాకరించింది.
వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకమంటూ మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ పరిణామం కీలకంగా మారింది. కర్ణాటక పార్టీ అగ్రనేతకు ఈ మేరకు స్పష్టమైన సంకేతాలను అధిష్టానం పంపిందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం షిమోగా జిల్లా నుంచి అసెంబ్లీకి యడియూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఇదే లోక్సభ నియోజకవర్గం నుంచి ఆయన పెద్దకుమారుడు రాఘవేంద్ర ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు రెండో కుమారుడికి ఎమ్మెల్సీ స్థానం కల్పిస్తే..బీజేపీపై దుష్ప్రభావం చూపుతుందని పార్టీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది.