దాయాది దేశం పాకిస్థాన్కు షాకిచ్చింది భారత్. ఈ నెల 23 నుండి పాకిస్థాన్ వేదికగా అందుల టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ ఈ టోర్ని నుండి వైదొలుగుతూ నిర్ణయం తీసుకుంది. భారత క్రికెట్ జట్టు పాకిస్థాన్లో పర్యటించడానికి భారత విదేశాంగ శాఖ అనుమతిని నిరాకరించింది.
పాకిస్థాన్ దేశానికి వెళ్లడానికి అంధుల క్రికెట్ జట్టుకు క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి ఎన్వోసీ లభించింది కానీ, భారత జట్టును అక్కడికి పంపడానికి విదేశాంగ శాఖ మాత్రం ఆమోదం తెలపలేదు. దీంతో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ లేకుండానే టోర్నీ జరగనుంది.
ఛాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనుండగా తమ జట్టు దాయాది దేశంలో పర్యటించబోదని ఇప్పటికే ఐసీసీకి బీసీసీఐ తేల్చిచెప్పింది. టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించి, భారత్ మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని కోరింది. కానీ దీనికి పాక్ బోర్డ్ అంగీకరించ లేదు. ఈ పరిణామాల నేపథ్యంలోనే అంధుల ప్రపంచకప్ నుంచి భారత్ వైదొలగడం చర్చనీయాంశంగా మారింది.