తమిళనాడులో ఎన్నికల వేడి నెలకొన్న వేళ మరో రాజకీయ వివాదం చెలరేగింది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నైనర్ నాగేంద్రన్ … నటుడు-రాజకీయ నాయకుడు విజయ్పై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. విజయ్ రాజకీయ అనుభవం లేనివాడని విమర్శిస్తూ, “ముందుగా త్రిషా ఇంటి నుంచి బయటకు రావాలి, అప్పుడే ఏదైనా సాధ్యమవుతుంది” అని వ్యాఖ్యానించారు. అలాగే, “ఇంటిమీదకే ఎక్కలేని వ్యక్తి స్వర్గానికి ఎక్కాలని కలలు కంటున్నాడు” అంటూ ఎద్దేవా చేశారు.
విజయ్ తన పార్టీ (టీవీకే) రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ఏకైక ప్రత్యర్థి అవుతుందని చెప్పిన నేపథ్యంలో నాగేంద్రన్ ఈ వ్యాఖ్యలు చేశారు. తరువాత తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోమని అడిగినా, “నేను ఒక్కసారే అన్నాను” అంటూ తన వ్యాఖ్యలపైనే నిలబడ్డారు.
ఈ వ్యాఖ్యలపై అధికార పార్టీ డీఎంకే తీవ్రంగా స్పందించింది. డీఎంకే ప్రతినిధి ఈలన్గోవన్ బీజేపీ నాయకులు మహిళలకు గౌరవం ఇవ్వరు అని ఆరోపించారు. తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెల్వపెరున్తగై కూడా ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం తగదని అన్నారు.
అయితే బీజేపీ నాయకురాలు విజయ ధరణి.. నాగేంద్రన్ వ్యాఖ్యలను సమర్థిస్తూ, అవి మంచి ఉద్దేశంతో చేసినవేనని చెప్పారు. ఈ ఘటనతో తమిళనాడు రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రంలో మే నెలకు ముందే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
