వైసీపీలో ముసలం మొదలయ్యింది. జగన్ ఒక వైపు పాదయాత్రలో ఉండగా పార్టీలో మాత్రం లుకలకలు భయటపడుతున్నాయి. తాజాగా అరకు నియోజవర్గంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై పాడేరు వైసీపీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి షాక్ కు గురయ్యారు. జరుగుతున్న పరిణామాలపై పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డిని నిలదీశారు .
అసలు విషయానికి వస్తె పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి సమాచారం ఇవ్వకుండా అరకు నియోజకవర్గంలో పార్టీ సమావేశాన్ని పెట్టడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అరకు అసెంబ్లీ టికెట్ ను రవిబాబుకు ఇస్తామంటూ ప్రకటించడంపై మండిపడ్డారు. దీంతో విజయసాయిరెడ్డిని కడిగి పారేశారు. ఏంటి సార్ పొమ్మనలేక పొగ పెడుతున్నారా” అంటూ ముఖంమీదే అడిగేశారు. తనకు సమాచారం ఇవ్వకుండా అరకులో సమావేశం ఎలా పెడతారని ప్రశ్నించారు.
మరో వైపు సొంత పార్టీకి చెందిన కొంత మంది నేతలు తమను బాగా ఇబ్బంది పెడుతున్నారని కంటతడి పెట్టారు. అరకు టికెట్ ను శెట్టి ఫాల్గుణకే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ రాకపోవడంతో టీడీపీలో చేరిన రవిబాబు తిరిగి వైసీపీలో చేరేందుకు యత్నిస్తున్నారు. 19వ తేదీన సమావేశాన్ని ఏర్పాటు చేసి, కొందరు వైసీపీ నేతలను ఆహ్వానించారు. ఈ సమావేశంలో వైసీపీ టికెట్ రవిబాబుకే అంటూ ప్రకటించారు.
జగన్ ను తీవ్రంగా విమర్శించి టీడీపీలోకి వెళ్లిన రవిబాబుకు మళ్లీ టికెట్ ఇస్తామని ఎలా ప్రకటిస్తారని గిడ్డి ఈశ్వరి మండిపడుతున్నారు. విశాఖకు విజయసాయిరెడ్డి వస్తున్నారని తెలుసుకున్న ఈశ్వరి, నేరుగా తన అనుచరులతో కలసి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. చాంబర్ లో ఉన్న విజయసాయి వద్దకు వెళ్లి, తన అసంతృప్తిని వెళ్లగక్కారు. పార్టీ కోసం కేసులను సైతం ఎదుర్కొంటున్నవారికి కనీస గుర్తింపు కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో పరిణామాలు ఎలా మారనున్నాయో అనే ఆందోళన స్థానిక వైసీపీ నేతల్లో నెలకొంది.