మూడు నెలలకోసారి చేపట్టే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విధానం సమీక్ష గురువారం (ఏప్రిల్ 5) చేపట్టారు. ఆర్బీఐ చేపట్టిన త్రైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతూ నిర్ణయం తీసుకుంది. రెపోను 6.0 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగానే ఉంచుతున్నట్టు ఆర్బీఐ ప్రకటించింది. బ్యాంక్ రేటు ప్రస్తుతం 6.25 శాతంగా ఉంది.
సమావేశమైన ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యులు ఐదు మంది రేట్లు యథాతథానికి ఉంచేలా ఓటు వేశారు. మైఖేల్ పాత్రో ఒక్కరు మాత్రమే వడ్డీ రేట్లు పెంచాలని కోరారు. అయితే మెజార్టీ నిర్ణయం మేరకు రేట్లను అలాగే ఉంచారు. దీంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో పాజిటివ్ ధోరణి కనిపిస్తోంది.
తొలి త్రైమాసికంలో వినియోగ ధరల ద్రవ్యోల్బణం (సీపీఐ) 4.4 శాతం నుంచి 5.1 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. 2018-19లో రియల్ జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ మొదటి పరపతి విధాన సమీక్ష ఇది కావడం విశేషం.
అయితే రేట్లు యథాతథంగా ఉంచడానికి కారణం గ్లోబల్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఈ నిర్ణయంపై బ్యాంకింగ్, ప్రభుత్వ రంగ సంస్థల యాజమాన్యాలు భిన్నంగా స్పందించాయి.