ఆధునిక క్రికెట్లో అత్యుత్తమ షాట్స్ అంటే.. దిల్స్కూప్.. స్విచ్ షాట్స్.. ర్యాంప్ షాట్.. వాక్వే కట్.. పెరిస్కోప్ షాట్.. లాస్ట్ బట్ నాట్ లీస్ట్.. ధోనీ హెలికాప్టర్ షాట్.. అని టకటకా చెప్పేయొచ్చు. కానీ గురువారంనాటి మ్యాచ్లో రిషభ్ పంత్ కొట్టినషాట్లకు మాత్రం కొత్త పేర్లు వెతుకుతున్నారు క్రీడాపండితులు.
సన్రైజర్స్ చేతిలో ఓటమిపాలైన ఢిల్లీ డేర్డెవిల్స్ ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఢిల్లీ ఓడినా యువ బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ అద్భుత శతకంతో ఆకట్టుకున్నాడు. 63 బంతుల్లో 128 పరుగులతో నాటౌట్గా నిలిచిన పంత్.. 15 ఫోర్లు, 7 సిక్సర్లతో చెలరేగాడు. 36 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్.. తర్వాత కళ్లు చెదిరే షాట్లు ఆడాడు.
సన్రైర్స్ బౌలర్లని ఎవరినీ వదిలిపెట్టకుండా దుమ్ముదులిపాడు పంత్. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ20 బౌలరయిన భువీ బౌలింగ్లోనూ సిక్స్లతో విరుచుకుపడ్డాడు. భువీ వేసిన ఇన్నింగ్స్ 18వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్స్ కొట్టిన పంత్.. ఆ ఓవర్లో 18 పరుగులు పిండుకొని సెంచరీ పూర్తి చేశాడు. ఇక భువీ వేసిన చివరి ఓవర్లో తొలి బంతికి మ్యాక్స్వెల్ ఔట్ కాగా.. తర్వాతి బంతుల్ని వరుసగా 4,4,6,6,6 బాదిన పంత్ ఆ ఓవర్లో 26 పరుగులు రాబట్టాడు.
పంత్ సంచలన ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. ధావన్ (92 నాటౌట్), విలియమ్సన్ (83 నాటౌట్) భారీ భాగస్వామ్యం ముందు 187 పరుగుల లక్ష్యం సరిపోలేదు. దీంతో పంత్ ఖాతాలో ఎవరూ కోరుకోని రికార్డ్ చేరింది.
ఓ బ్యాట్స్మెన్ 128 రన్స్ చేసినా అతడి జట్టు ఓడటం ఐపీఎల్ చరిత్రలోనే ఇది తొలిసారి. గతంలో ఈ రికార్డ్ ఆండ్రూ సైమండ్స్ పేరిట ఉండేది. సైమండ్స్ 2008లో రాయల్ ఛాలెంజర్స్పై 117 పరుగులతో నాటౌట్గా నిలిచినప్పటికీ డెక్కన్ ఛార్జర్స్ను గెలిపించలేకపోయాడు.