క్రికెట్ మ్యాచ్లో ఏ జట్టు ముందుగా బ్యాటింగ్, బౌలింగ్ చేపట్టాలన్నది టాస్ మీదే ఆధారపడి ఉంటుంది. టాస్ ఎవరు గెలుస్తారు అన్నదానిపై ప్రేక్షకుల్లో ఉత్కంఠ నెలకొనడం సహజం. ఇక నుంచి టెస్ట్ క్రికెట్లో టాస్ పద్దతికి స్వస్థి చెప్పాలని ఐసీసీ నిర్ణయం తీసుకోబోతోంది.
1877లో అంతర్జాతీయ క్రికెట్ ఆరంభం అయినప్పటి నుంచి ఈ విధానం అమల్లో ఉంది. తొలుత బ్యాటింగ్, బౌలింగ్లో ఏది ఎంచుకోవచ్చనేది టాస్ గెలిచిన కెప్టెన్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా టెస్ట్ మ్యాచ్లలో టాస్ విధానం ద్వారా అతిథ్య జట్టుకు ప్రయోజనం చేకూరుతుందనే విమర్శలు ఎక్కువయ్యాయి.
మే 28, 29 తేదీల్లో ముంబైలో ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ‘టెస్ట్ ఛాంపియన్షిప్లో ఆతిథ్య జట్టు ప్రయోజనాలను తగ్గించే విధంగా కాయిన్ టాస్ను తొలగించేలా ఐసీసీ ఆధ్వర్యంలో కీలక చర్చ జరగనుంది’ అని ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫో గురువారం పేర్కొంది.
టాస్ ఆధారంగానే ఏ జట్టు ముందు బౌలింగ్ చేయాలి, బ్యాటింగ్ చేయాలి అనేది నిర్ణయిస్తారు. ఆతిథ్య జట్టు కెప్టెన్ కాయిన్ను గాల్లోకి ఎగరవేస్తే.. పర్యటక జట్టు కెప్టెన్ టాస్ను కోరుకుంటారు. కానీ ఇటీవల కాలంలో ఈ టాస్పై పలు రకాల చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టెస్టు క్రికెట్లో ఆతిథ్య జట్టుకు అనుకూలంగా టాస్ మారుతోందని విమర్శలు వస్తున్నాయి. ఆతిథ్య జట్టు తమకు అనుకూలంగా పిచ్ను తయారుచేసుకుంటోందని, దీంతో టాస్పై దాని ప్రభావం ఎక్కువగా ఉంటోందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా టాస్ కూడా ఆతిథ్య జట్టుకు లాభం చేకూర్చేలానే ఉందని విమర్శిస్తున్నారు.
టాస్ పై చర్చించనున్న ఐసీసీ క్రికెట్ కమిటీలో ఇండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, ఆండ్రూ స్ట్రాస్, మహేల జయవర్దనే, రాహుల్ ద్రవిడ్, టిమ్ మే, న్యూజిలాండ్ క్రికెట్ చీప్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్, అంపైర్ రిచర్డ్ కెటల్బారో, ఐసీసీ మ్యాచ్ రిఫరీల చీఫ్ రజన్ మదుగలే, షాన్ పొలాక్, క్లేర్ కానర్ ఉన్నారు.