టాలీవుడ్లో మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాత, కామాక్షి మూవీస్ అధినేత, నాగార్జున ప్రాణ స్నేహితుడు డి.శివ ప్రసాద్ రెడ్డి(62) కన్నుమూసారు. దీంతో సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.
కొంతకాలంగా ఆయన హృదయ సంబంధిత సమస్యతో బాధ పడుతున్నారు. ఆయనకు ఇటీవల ఆయనకు చెన్నైలోని అపోలో హాస్పిటల్లో ఇటీవల ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్ 27 ఉదయం 6.30 గంటలకు చెన్నైలో ఆయన తుదిశ్వాస విడిచారు.
చెన్నైలోని అపోలో హాస్పిటల్లో కొన్ని రోజులుగా ఆయన చికిత్స తీసుకుంటున్నారు. శివప్రసాద్ రెడ్డి అంటే తెలియని వాళ్లు ఉండరు. ఆయన కామాక్షి మూవీస్ చాలా పాపులర్. ఈయనకు ఇద్దరు కుమారులు. 1985లో కామాక్షి మూవీస్ బ్యానర్ను స్థాపించి “కార్తీక పౌర్ణమి”, “శ్రావణ సంధ్య”, “విక్కీ దాదా”, “ముఠామేస్త్రి”, “అల్లరి అల్లుడు”, “ఆటోడ్రైవర్”, “సీతారామరాజు”, “ఎదురులేని మనిషి”, “నేనున్నాను”, “బాస్”, “కింగ్”, “కేడీ”, “రగడ”, “దఢ”, “గ్రీకువీరుడు” లాంటి సినిమాలు నిర్మించారు.
ముఖ్యంగా అక్కినేని కుటుంబంతో.. నాగార్జునతో ఆయనకు ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే ఎక్కువగా నాగార్జునతోనే ఎక్కువ సినిమాలు నిర్మించాడు శివప్రసాద్ రెడ్డి. ఈయన మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. అక్టోబర్ 28న ఆయన అంత్యక్రియలు జరగనున్నాయి.