తెలంగాణ రాష్ట్రంలో ఎటువంటి అవినీతికి తావు లేని పాలన అందిస్తామని, అవినీతిని రూపుమాపేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఐటి, పురపాలక శాఖ మంత్రి కె. తారక రామారావు ప్రకటించారు. ఇందుకోసం అవినీతిపై ఎవరైనా ఫిర్యాదులు చేయాలనుకున్న వారికి వీలుగా ఓ వెమ్ సైట్ ను ప్రారంభిస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటిల్లోనూ ప్రజల భాగస్వామ్యంతో పనులు చేపడతామని చెప్పారు. కార్పొరేషన్లలో వివిధ కార్యక్రమాల కోసం ప్రభుత్వం 500 కోట్ల కేటాయించిందని, మరో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించేందుకు సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రజలు తమ అవసరాల కోసం ఎవరికి లంచాలను ఎరగా చూపించరాదని, అధికారులు ఎవరైనా లంచాల కోసం వేధిస్తే వెంటనే వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని ఆయన అన్నారు.
తెలంగాణలోని 73 మున్సిపాల్టీలు, నగర పంచాయితీలు, కార్పొరేషన్లలలో ఎల్ ఇడి బల్బులను ఏర్పాటు చేస్తామని ప్రజలను భాగస్వాములను చేస్తూ ఏరియా కమిటీలను కూడా వేస్తామని ఆయన చెప్పారు. అలాగే ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం ఎవరూ ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునేలా ఏర్పాట్లు చేస్తామన్నారు.
