ఎన్నికల కోడ్ ఉన్నా ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహిస్తున్నచంద్రబాబుపై సీఈసీ కన్నెర్ర జేసింది. ఫలితాలు వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించ వద్దని నింబధనలు స్పష్టం చేస్తున్నా అవన్నీ బేఖాతరు చేస్తూ బాబు సీఎం తొలుత పోలవరంపై, ఆపై సీఆర్డీయేపై సమీక్షలు జరిపిన విషయం సీఈసీకి తెలియడంతో చర్యలకు ఉపక్రమించింది.
ఎన్నికల కోడ్ నిబంధనలకు విరుద్ధంగా పోలింగ్ జరిగిన తర్వాత బాబు 18 జీవోలను విడుదలచేశారు. బాబు సర్కారు జారీ చేసిన 18 జీవోలను రద్దు చేయాలని ఈసీ సిఫార్సు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం వాటిని రద్దు చేశారు.
చంద్రబాబు నిర్వహించే సమీక్షా సమావేశాలకు హాజరైన 16 మంది అధికారులకు ఈసీ నుంచి సంజాయిషీ ఇవ్వాలంటూ నోటీసులు అందాయి. వాస్తవానికి ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత, ప్రకృతి విపత్తులు, పెను ప్రమాదాలు సంభవించినప్పుడు మాత్రమే సీఎం సమీక్షలను నిర్వహించుకోవచ్చు. అది కూడా ఈసీ అనుమతి తీసుకునే జరపాలి. కాని బాబు మాత్రం తొలుత పోలవరంపై, ఆపై సీఆర్డీయేపై సమీక్ష జరిపారు. ఇదే సమయంలో కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ కావడంతో తాను జరపాలని తలపెట్టిన హోమ్ శాఖ సమీక్షను చంద్రబాబు రద్దు చేసుకున్నారు.ఇక రద్దు చేసిన జీవోల్లో అత్యధికం కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బిల్లులవేనని తెలుస్తోంది. అత్యత్సాహం ప్రదర్శించ బాబు సమీక్షకు హజరయిన ఉద్యోగులు చిక్కుల్లో పడ్డారు.